ముర్తాల్ మాస్ రేప్స్: దాబాల్లో నగ్నంగా మహిళలు!
ఛండీగఢ్: హర్యానాలో జాట్ల ఆందోళన సందర్భంగా ముర్తాల్లో మహిళలపై సామూహిక అత్యాచారాలు జరిగాయన్న ఆరోపణల్లో వాస్తవముందని తేలింది. దీనిపై దర్యాప్తు చేస్తున్న ప్రకాశ్ కమిటీ తన నివేదికలో కీలక అంశాలను పొందుపర్చినట్లు తెలిసింది.
కాగా, నివేదికలోని అంశాలను వెల్లడించేందుకు ప్రభుత్వం ఇష్టడటం లేదు. ఈ నివేదికను సోమవారం పంజాబ్-హర్యానా హైకోర్టుకు సమర్పించింది. సామూహిక అత్యాచారాలు జరగలేదన్న ప్రభుత్వం వాదనకు విరుద్ధంగా ఇందులోని అంశాలున్నట్లు తెలిసింది.
'ఫిబ్రవరి 22న జాట్ల ఆందోళన సందర్భంగా ముర్తాల్లో నగ్నంగా ఉణ్న మహిళలు రోడ్డుపక్కన దాబా హోటళ్లలో తలదాచుకున్నారు. ఈ మేరకు దాబా యజమాని ఇచ్చిన వాంగ్మూలాన్ని ముగ్గురు సభ్యుల ప్రకాశ్ కమిటీ రికార్డు చేసింది. తన హోటల్లో తలదాచుకున్న మహిళలకు దుప్పట్లు, బట్టలు ఇచ్చానని దాబా యజమాని చెప్పాడు. తర్వాత వారిని సురక్షితంగా ఇంటికి పంపించాడని రిపోర్ట్లో పేర్కొంది'అని సీనియర్ న్యాయవాది అనుపమ్ గుప్తా వెల్లడించారు.
అయితే అత్యాచారాలు జరగలేదని దాబా యజమాని తమ విచారణలో చెప్పాడని కోర్టుకు 'సిట్' చీఫ్ మమతా సింగ్ తెలిపారు. కోర్టు విచారణ సందర్భంగా గుప్తా, హర్యానా ప్రభుత్వ తరపు న్యాయవాది లోకేష్ సిన్హాల్ మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి.
జాట్ల ఆందోళన సందర్భంగా పదుల సంఖ్యలో మహిళలపై సామూహిక అత్యాచారాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అంతేగాక, ఈ ఆందోళనల్లో 30మంది మృతి చెందగా, 300కు పైగా గాయాలపాలయ్యారు.