భగవద్గీతపై పరీక్ష: ముస్లిం విద్యార్థినికి ప్రథమ బహుమతి
ముంబై: హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతపై నిర్వహించిన పరీక్ష పోటీలో ఓ ముస్లిం విద్యార్థిని ప్రథమ స్థానం దక్కించుకుంది. 3వేల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో మిగితా వారందరినీ వెనక్కునెట్టిన బాలిక తొలిస్థానంలో నిలిచి బహుమతి అందుకుంది. ఈ ‘గీతా ఛాంపియన్స్ లీగ్' పోటీని ఇస్కాన్ గత జనవరిలో నిర్వహించింది.
వివరాల్లోకి వెళితే.. గత జనవరిలో ఇస్కాన్(ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్) సంస్థ 'గీతా చాంపియన్స్ లీగ్' అనే అంశంపై పరీక్ష పోటీ నిర్వహించింది. ఇందులో పలు పాఠశాలల నుంచి 3వేల మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
బహులైఛ్చిక ప్రశ్నల రూపంలో ఈ పరీక్ష నిర్వహించగా ఈ పరీక్షలో ఆరోతరగతి చదువుతున్న 12ఏళ్ల మర్యమ్ సిద్ధిఖీ తొలి బహుమతిని అందుకోవడం విశేషం. ఈ సందర్భంగా మర్యమ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఖాళీగా ఉన్న సమయాల్లో మతాలకు సంబంధించిన పుస్తక పఠనం చదువుతానని, ఎప్పుడైతే ఈ కాంపిటేషన్ గురించి విన్నానో అప్పుడే భగవద్గీత గురించి తెలుసుకునే అవకాశం వస్తుందని ఆలోచించి చదవడం నేర్చుకున్నానని తెలిపింది.
ఇందుకు తన తల్లిదండ్రులు ఎంతో సహకరించారని చెప్పింది. ఆ ప్రిపరేషనే తనకు మొదటి బహుమతి రావడానికి కారణమైందని వివరించింది. మానవత్వమే చాలా ముఖ్యమైన మతమని చెప్పింది. ముంబైలోని మీరా రోడ్డులోగల కాస్మోపాలిటన్ రోడ్డులో ఈ బాలిక చదువుతుంది. పరీక్షకు నెల రోజుల ముందుగా ఇస్కాన్ సంస్థ వాళ్లే సంబంధిత మెటీరియల్ ఇచ్చారు. మర్యమ్ పాఠశాల పరీక్షలల్లో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిందని ఉపాధ్యాయురాలు స్వప్న బ్రహ్మానంద్కర్ చెప్పారు.