మహారాష్ట్ర రాజకీయాల్లో షిండే కలకలం: రేపు సీఎం ఉద్ధవ్ నేతృత్వంలో కేబినెట్ భేటీ
ముంబై: మహారాష్ట్రలో పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో మహా వికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్రలోని అధికార మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) నాయకులు మంగళవారం సాయంత్రం ముంబైలోని వర్షా బంగ్లాలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు. ఎన్సీపీ నేతలు ఛగన్ భుజ్బల్, దిలీప్ వాల్సే పాటిల్, జయంత్ పాటిల్, అజిత్ పవార్ సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు.
ప్రస్తుత రాజకీయ సంక్షోభం దృష్ట్యా, మహారాష్ట్ర మంత్రివర్గం రేపు(బుధవారం) మధ్యాహ్నం 1 గంటలకు సమావేశం కానుంది. కాగా, 17-18 మంది ఎమ్మెల్యేలు ఏకనాథ్ సిండేతో ఉన్నారని, మరికొందరిని బలవంతంగా ఆపుతున్నారని శివసేన నాయకుడు విక్రమ్ సింగ్ యాదవ్ అన్నారు.
ఏక్నాథ్ షిండే వ్యవహారంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి నిరంజన్ శెట్టి స్పష్టం చేశారు.
శివసేన ఎందుకు బీజేపీని వీడిందో అందరికీ తెలుసు: సంజయ్ రౌత్
'మా వ్యక్తులు ఇద్దరు అక్కడికి (సూరత్) వెళ్లారు. ఏకనాథ్ షిండేతో చర్చలు జరిగాయి. ఆయన మా పాత మిత్రుడు.. మేం బీజేపీని ఎందుకు వదిలేశామో అందరికీ తెలుసునని, దానికి ఏకనాథ్ షిండే కూడా సాక్షి' అని మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.