‘‘మోడీని ఇన్సల్ట్ చేసినందుకే నా భర్త అలా.. అంత కోపం చూడడం ఇదే తొలిసారి’’
ఎయిరిండియా విమానంలో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ దుష్ప్రవర్తన యావత్ దేశాన్నే కాదు.. ఆయన కుటుంబ సభ్యులను కూడా విస్మయపరిచింది.
ముంబై: ఎయిరిండియా విమానంలో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ దుష్ప్రవర్తన యావత్ దేశాన్నే కాదు.. ఆయన కుటుంబ సభ్యులను కూడా విస్మయపరిచింది. తన భర్తలో అంత కోపాన్ని చూడడం ఇదే తొలిసారి అని గైక్వాడ్ భార్య ఉష పేర్కొన్నారు.
''నా భర్త ఎవరినైనా అలా కొట్టగలరని నేనెప్పుడూ అనుకోలేదు. ఢిల్లీలో తొలిసారి ఆయనలోని హింసాత్మక కోణాన్ని చూశాను. ఎయిరిండియా సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం వల్లే ఆయన అలా ప్రతిస్పందించారు..'' అని ఆమె వ్యాఖ్యానించారు.

తన భర్తకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఆయన ఇలాంటి చర్యకు పాల్పడుతారని వ్యకిగతంగా ఆయన గురించి తెలిసిన వారెవరూ భావించరంటూ ఉష తన భర్తను వెనకేసుకొచ్చారు.
కొన్నేళ్ల కిందట ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ లో రంజాన్ సందర్భంగా ఓ ముస్లిం వ్యక్తికి బలవంతంగా తినిపించేందుకు ప్రయత్నించి.. గైక్వాడ్ వివాదం రేపిన సంగతి తెలిసిందే. అయితే తన భర్తకు అంత కోపం రావడం తానెప్పుడూ చూడలేదని, ఎయిరిండియా సిబ్బంది మొరటు ప్రవర్తన వల్లే సహనం కోల్పోయిన ఆయన అలా ప్రవర్తించారని ఆమె అన్నారు.
విమానంలో ఎయిరిండియా సిబ్బందిని చెప్పుతో కొట్టి.. వారిపై దౌర్జన్యపూరితంగా మీ భర్త గైక్వాడ్ ప్రవర్తించడం సబబేనా? అన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ''ఎయిరిండియా నాసిరకం సేవలు గురించి నా భర్త ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా వారు పట్టించుకోలేదు. ఫిర్యాదు తీసుకోవడానికి బదులుగా వారు ఆయనతో వాగ్వాదానికి దిగారు. చివరికి ప్రధాని నరేంద్ర మోడీ పేరును కూడా అగౌరవపరుస్తూ అవమానకరంగా మాట్లాడారు. దీంతో నా భర్త సహనం కోల్పోయారు..'' అంటూ ఆమె ముక్తాయించారు.












Click it and Unblock the Notifications