నా భర్త నన్ను, పిల్లల్ని చంపేయాలనుకుంటున్నారు! టీవీ నటి
ముంబై: తన భర్త అరోరా తనను, తన పిల్లలను చంపాలని చూస్తున్నాడని ప్రముఖ టీవీ నటి దీప్శిఖ నాగ్పాల్ ఆరోపించారు. తన పెళ్లి జీవితంలోని సమస్యలను ఆమె వెల్లడించారు. ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తాను తన భర్త నుండి కాపాడుకోవడం కోసం రక్షణ కావాలని పోలీసులను అడిగినట్లు చెప్పారు.
తాను పోలీసుల వద్దకు వెళ్లానని, నా భర్త నుండి తనకు, తన కుటుంబ సభ్యులను రక్షించాలని కోరానని చెప్పారు. తన భర్త తనను, తన పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు.
ఇటీవల, ఏప్రిల్ 10వ తేదీ నుండి 15 తేదీ మధ్యన దీప్శిఖ సామాజిక అనుసంధాన వేదిక ద్వారా తన సమస్యలను ఏకరవు పెట్టారు.
జీవితం చాలా కష్టమైనదని, అయితే తాను చాలా ధైర్యవంతురాలినని ఓ ట్వీట్లో పేర్కొన్నారు. తాను పోరాడుతానని పేర్కొన్నారు. దేవుడు నాకు శక్తిని ఇవ్వాలన్నారు. పోరాడినప్పుడు జీవితంలో ఏం కోల్పోయామో తెలుస్తుందని, ఆ తర్వాత గత జీవితం కంటే ఇప్పుడు చాలా బాగున్నామని తెలుసుకుంటామని మరో ట్వీట్లో పేర్కొన్నారు.
కాగా, టీవీ నటి దీప్శిఖకు ఆరోరాతో జనవరి 2012లో వివాహం జరిగింది. దీప్శిఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొన్నారు. ఇది దీప్శిఖకు రెండో పెళ్లి. ఆమెకు ఈ రెండో పెళ్లి కంటే ముందే మొదటి పెళ్లి ద్వారా విధిక, వివాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మొదటి భర్త జీత్ ఉపేంద్ర. అతనితో పదేళ్ల పాటు జీవితం పంచుకున్నారు.