‘హిందువువా? అని అడిగి సజీవ దహనం చేశారు’
ముంబై: హిందువు అయినందుకే తన కుమారుడిని ముగ్గురు వ్యక్తులు పెట్రోలు పోసి తగులబెట్టేశారని ఓ తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ కుర్రాడి మరణ వాంగ్మూలానికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. సావన రాథోడ్(17) పుణెలో చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, జనవరి 13న తీవ్రంగా కాలిన గాయాలతో పుణె ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అతడు జనవరి 15న మరణించాడు.
‘ముగ్గురు కుర్రాళ్లు నా దగ్గరకు వచ్చారు. ఏం చేస్తున్నావని అడిగారు. నీ పేరేంటని ప్రశ్నించారు. నా పేరు సావన రాథోడ్ అని చెప్పాను. నువ్వు హిందువువా అని వాళ్లు అడిగారు. నేను అవునని చెప్పాను. ఆ వెంటనే వాళ్లు నా మీద పెట్రోలు పోసి కాల్చేశారు' అని ఆ కుర్రాడు స్పష్టంచేశాడు.
హిందువు అయినందుకే కాల్చేశారా? అని ప్రశ్నించగా అవునని పునరుద్ఘాటించాడు. హిందువునని తెలిసిన తర్వాతే ముగ్గురు యువకులు తనను కాల్చి చంపేశారని ఆస్పత్రిలో చేర్చే సమయంలో తన కుమారుడు చెప్పాడని సావన రాథోడ్ తండ్రి ధర్మా వివరించారు.
అయితే, ఇదే కేసుకు సంబంధించి పోలీసులు ఇబ్రహీం షేక్, జుబేర్ తండోలీ, ఇమ్రాన తంబోలీ అనే యువకులను అరెస్టు చేశారు. అతడు కారు బ్యాటరీలను దొంగిలించాడని అనుమానించామని, అందుకే పెట్రోలు పోసి తగులబెట్టేశామని వారు పోలీసులకు తెలిపారు.
కాగా, ఈ దారుణ ఘటనపై ఏ నాయకుడు స్పందించకపోవడం గమనార్హం. అయితే సమస్త హిందూ ఆఘాది అనే సంస్థ ఈ ఘటనపై స్పందించింది. ఉగ్రవాద వ్యతిరేక బృందంతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఘటనను నిరసిస్తూ జనవరి 27న పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టనున్నట్లు ఈ సంస్థ కార్యకర్త మిలింద్ ఇక్బోత్ తెలిపారు.