ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణం: అయిదుమందితో కొత్త కేబినెట్
చండీగఢ్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో వరుసగా రెండోసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ శకం ఆరంభమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్ బీరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని ఇంఫాల్లో కొద్దిసేపటి కిందటే ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది. గవర్నర్ లా గణేషన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వరుసగా రెండోసారి. ఇదివరకు కూడా మణిపూర్కు ఆయనే ముఖ్యమంత్రి.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించినందున బీజేపీ అధిష్ఠానం ఆయనకు మరోసారి ముఖ్యమంత్రిగా అవకాశాన్ని ఇచ్చింది. నేమ్చా కిప్జెన్, వై ఖేమ్చంద్ సింగ్, బిశ్వజిత్ సింగ్, అవంగ్బో న్యూమయ్, గోవింద్ దాస్ కొంథౌజమ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర ఇన్ఛార్జ్.. సీనియర్ నాయకులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం బీరేన్ సింగ్ కొద్దిసేపు మాట్లాడారు. తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక గురించి వివరించారు.

బీజేపీపై ఎంతో విశ్వాసంతో మణిపూర్ ఓటర్లు వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాన్ని తనకు ఇచ్చారని, వారి ఆశలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తానని అన్నారు. పార్టీ నాయకత్వం కొత్త వారికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తుందంటూ వచ్చిన వార్తలు వాస్తవం కాదని వ్యాఖ్యానించారు. అందరి అభిప్రాయాన్ని తీసుకున్న తరువాత.. ఏకగ్రీవంగా పార్టీ అగ్ర నాయకత్వం తన పేరును ఖరారు చేసిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం తొలుత థొంగం బిశ్వజిత్ సింగ్, స్పీకర్ యుమ్నమ్ ఖేమ్చంద్ పేర్లు చక్కర్లు కొట్టాయి.
మణిపూర్ ఓటర్లు సుస్థిర ప్రభుత్వానికి ఓటు వేశారని అన్నారు. సుస్థిర ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, ఈ విషయాన్ని ఓటర్లు మరోసారి రుజువు చేశారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే ఈశాన్య రాష్ట్రాల సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుందని బీరేన్ సింగ్ అన్నారు. ప్రజల ఆశయాలు, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పాలన సాగిస్తానని చెప్పారు.
60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ స్పష్టమైన మెజారిటీని సాధించింది. 32 స్థానాలతో విజయఢంకా మోగించింది. 2017 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కంటే 12 సీట్లను అధికంగా గెలుచుకోగలిగింది. 37.8 మేర ఓట్ల శాతాన్ని సాధించింది. 2017 కంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ. మణిపూర్ మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా బీరేన్ సింగ్ రికార్డు సాధించారు. ఇప్పుడాయన వరుసగా రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.












Click it and Unblock the Notifications