'పద్మ' కడిగిన ముత్యం: నాడు ఆరోపణలు.. నేడు పురస్కారాలు
దేశ రక్షణశాఖకు సంబంధించిన రహస్యాలు ఇతరదేశాలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొని ఆ తర్వాత సుప్రీంకోర్టు నుంచి క్లీన్ చిట్ పొందిన ఇస్రో మాజీ సైంటిస్ట్ నంబి నారాయణ్కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. పద్మభూషణ్ అవార్డు దక్కడం చాలా సంతోషంగా ఉందని అన్నారు నంబి నారాయణ్.
"అవును చాలా సంతోషంగా ఉన్నాను. గూఢచర్యం ఆరోపణలకు నేను బలయ్యాను. అలా చాలా పాపులర్ అయ్యాను. అంటే ప్రజలు చాలామంది నాపట్ల సానుభూతితో వ్యవహరించారు. పద్మభూషణ్ అవార్డు కేంద్రం నాకు ఇచ్చింది అంటే నేను దేశానికి చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించింది అని చెప్పేందుకు నిదర్శనం" అని అన్నారు నంబి నారాయణ్.
నంబి నారాయణ్ రహస్యంగా ఉంచాల్సిన టెస్ట్ డేటాను శతృదేశాలకు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు.ఈ ఆరోపణలపై ఆయన్ను డిసెంబరు 1994లో అరెస్టు చేయడం జరిగింది. భారత్ అంతరిక్షంలోకి పంపిన తొలి పీఎస్ఎల్వీలో అమర్చిన వికాస్ ఇంజిన్ను నంబి నారాయణ్ రూపొందించారు. ముఖ్యమైన రక్షణ రహస్యాలను మాల్దీవులకు చెందిన ఇంటెలిజెన్స్ ఆఫీసర్లకు లీక్ చేశారని నంబినారాయణ్తో పాటు మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వికాస్ ఇంజిన్ డిజైన్, క్రైయోజినిక్ టెక్నాలజీ డేటాను లీక్ చేశారనే ఆరోపణలు వీరు ఎదుర్కొన్నారు.
ఇదిలా ఉంటే 50 రోజుల పాటు కస్టడీలో ఉన్నప్పుడు ఆయన్నుపోలీసులు చిత్రహింసలకు గురిచేశారని చెప్పారు నంబి నారాయణ్. గతేడాది సెప్టెంబర్ 14న నంబినాయర్ ఎలాంటి గూఢచర్యంకు పాల్పడలేదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.ఆయనపై ఉన్న కేసులన్నీ కొట్టివేసింది. అంతేకాదు కేరళ ప్రభుత్వం ఆయనకు రూ.50 లక్షలు పరిహారం చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.