త్వరలో మోడీ మంత్రివర్గ విస్తరణ: అరుణ్ శౌరీకి చోటు?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. మరో 20 మందికి అవకాశం కల్పిస్తూ మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. జూలై రెండో వారంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న దృష్ట్యా ఈ నెలలోనే ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ విస్తరణను పూర్తి చేయాలని భావిస్తున్నారు.
తొలి విడతలో స్థానం దక్కించుకోని బిజెపి నేతలు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు ఈసారి అవకాశం కల్పించనున్నారు. ముఖ్యంగా మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, బీహార్ నుంచి ఎక్కువ మందికి ప్రాతినిధ్యం దక్కుతుందని అంటున్నారు. పశ్చిమ బెంగాల్లో పార్టీని పటిష్టపర్చే ఉద్దేశంతో ఉన్న మోడీ ఆ రాష్ట్రానికీ అధిక ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు.
రాజీవ్ప్రతాప్ రూడీ, ముక్తార్ అబ్బాస్ నక్వీ లాంటి సీనియర్లకు ఈసారి బెర్తులు దక్కవచ్చని సమాచారం. అరుణ్ శౌరి, మహారాష్ట్రకు చెందిన రిపబ్లికన్ పార్టీ నేత రామదాస్ అథవాలే వంటి వారికీ అవకాశం లభించవచ్చని భావిస్తున్నారు. అథవాలేకు చోటు కల్పించడం ద్వారా త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దళిత ఓటర్లను ఆకర్షించవచ్చని మోడీ భావిస్తున్నారు.

మంత్రివర్గ విస్తరణతోపాటు కొన్ని రాష్ట్రాల గవర్నర్లను మార్పు చేయడంపై, పార్టీకి కొత్త చీఫ్ను నియమించడంపై మోడీ దృష్టిసారించనున్నారు. వృద్ధనేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించకూడదన్న నియమం కారణంగా అలాంటి వారికి గవర్నర్లుగా అవకాశం కల్పించాలని ప్రధాని భావిస్తున్నారు.
ఈ రేసులో పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ, రాజకీయ నాయకుడిగా మారిన ఐఎఫ్ఎస్ అధికారి హరదీప్ పూరి, బిజెపి వృద్ధ నేత లాల్జీ టాండన్ ఉన్నారు. వీరిలో పూరికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా, జోషీకి మహారాష్ట్ర గవర్నర్గా అవకాశం లభించవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాంటున్నారు. ఇక పార్టీ అధ్యక్ష పదవికి జేపీ నడ్డా, ఓపీ మాధుర్లతోపాటు మోడీ సన్నిహితుడు అమిత్షా పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications