ఎన్సీపీని, శరద్ పవార్ ను మింగేయబోతున్న మోడీ, అమిత్ షా?
బంధాలు.. అనుబంధాలు వేరు.. రాజకీయం మాత్రం రాజకీయమే అన్నట్లుగా భారతీయ జనతాపార్టీ నేతల తీరు ఉంటుందనే విషయం తెలిసిందే. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన తరుణంలో ఎన్సీపీ, కాంగ్రెస్తో జట్టుకట్టిన ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. రెండున్నర సంవత్సరాల కాలం గిర్రున తిరిగి వచ్చింది. ప్రభుత్వం కుప్పకూలింది. మహావికాస్ అఘాడీ బదులు ఏక్నాథ్ షిండే వర్గం బీజేపీ మద్దతుతో అధికారాన్ని చేజిక్కించుకుంది.

మిషన్ మహారాష్ట్రను ప్రారంభించిన బీజేపీ
బీజేపీ మద్దతుతో ఏక్నాథ్ షిండే వర్గం ఇంత తిరుగుబాటు చేయడానికి బీజేపీ ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ వ్యూహాన్ని అమలు చేసింది. అసెంబ్లీ ఎన్నికలకన్నా లోక్సభ సీట్లు సాధించడమే ఆ పార్టీకి ముఖ్యం. అందుకే మిషన్ మహారాష్ట్రను ప్రారంభించింది. అందులో మొదటి అంకం ఏక్నాథ్ షిండే. అది పూర్తయింది. రెండో అంకం నేషనలిస్ట్స్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం. ఎన్సీపీ మహారాష్ట్రలోనే కాకుండా దక్షిణాదిలోని రాష్ట్రాలు మినహా ఈశాన్య రాష్ట్రాలతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లోను తన ఉనికిని బలంగా చాటుతోంది. చెప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లు సాధిస్తోంది.

ప్రతిపక్షాల సీట్లు గెలుచుకోవడమే లక్ష్యం
ఆ పార్టీకి ఆయువుపట్టు మహారాష్ట్ర. రాష్ట్రంలో ఎన్సీపీతోపాటు ప్రతిపక్షాలు వరుసగా విజయం సాధిస్తున్న 16 లోక్సభ నియోజకవర్గాలను బీజేపీ గుర్తించింది. రాబోయే ఎన్నికల్లో శివసేనతో పొత్తు ఉంటుంది కాబట్టి కాంగ్రెస్కన్నా ఎన్సీపీపైనే ఆ పార్టీ ఎక్కు వ ఫోకస్ పెట్టింది. గత లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ సభ్యుల గెలుపుతోపాటు ప్రతిపక్షాల సీట్లను గెలుచుకోవాలని భావిస్తోంది. 2019 ఎన్నికల్లో మొత్తం 48 నియోజకవర్గాలకుగాను బీజేపీ 25 సీట్లలో పోటీచేసి 23 సీట్లలోను, శివసేన 23 సీట్లలో పోటీచేసి 18 సీట్లలోను గెలుపొందారు. ఎన్సీపీ 4, కాంగ్రెస్ ఒకటి గెలుచుకుంది.

నిర్మలా సీతారామన్ తోపాటు ఇతర నేతలకు బాధ్యతలు
మహారాష్ట్రలో ప్రతిపక్షాల స్థానాలను కూడా చేజిక్కించుకునే బాధ్యతను అధిష్టానం ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్తోపాటు పలువురు సీనియర్ నేతలకు అప్పగించింది. అమె ముఖ్యంగా శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలె ప్రాతినిధ్యం వహిస్తున్న బారామతిపై దృష్టిసారించారు. ఇక్కడ సెప్టెంబరులో నిర్మల పర్యటించబోతున్నారు. ఇక్కడి బాధ్యతలు తీసుకున్న ఇతర నేతలు కూడా త్వరలోనే తమ పర్యటన ప్రారంభించబోతున్నారు. రాజకీయంగా కాకలుతీరిన యోధుడిగా, వ్యూహకర్తగా పేరుపొందిన శరద్ పవార్ ను నిరోధించగలిగితే రానున్న ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధించుకోవడానికి అవకాశం ఉంటుందనేది బీజేపీ వ్యూహంగా ఉంది.












Click it and Unblock the Notifications