మోడీ వెయ్యి కోట్ల సాయం: బాబుకు, ప్రజలకు కితాబు
విశాఖపట్నం: విశాఖవాసులకు అండగా ఉంటానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం చెప్పారు. హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో మోడీ మధ్యాహ్నం పర్యటించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన పర్యటించారు. మోడీ విశాఖ రాకముందే ఏరియల్ సర్వే నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. పెను తుఫానును ధైర్యంగా ఎదుర్కొన్న విశాఖవాసులను ఆయన అభినందించారు. కొద్ది రోజులలోనే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని చెప్పారు. తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలకు గాను తక్షణ సాయం కింద మోడీ ఆంధ్రప్రదేశ్కు రూ.వెయ్యి కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు ప్రభుత్వానికి సహకరించారన్నారు.
సాధారణ పరిస్థితి నెలకొనే వరకు విశాఖ వాసులకు అండగా ఉంటానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అండగా నిలబడతామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కట్టుగా పని చేశాయని, ప్రభుత్వాల సమన్వయం వల్ల తుఫాను నష్టం చాలా తగ్గిందన్నారు. నష్ట నివారణకు నేవీ, కోస్ట్ గార్డ్, ఆర్మీ కృషి చేశాయన్నారు. విశాఖను స్మార్ట్ సిటీగా చేస్తానని తాను అమెరికాలోను హామీ ఇచ్చానని గుర్తు చేశారు.
తుపాను సహాయక చర్యల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ ప్రశంసించారు. తుపాను కారణంగా మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు పరిహారం ప్రకటించారు. తుపాను కారణంగా చేతికొచ్చిన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిశాకు కూడా అండగా ఉంటామన్నారు.
పంట నష్టపోయిన రైతుల విషయమై తాను బీమా కంపెనీలతో మాట్లాడతానన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. మోడీ వెంట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తదితరులు ఉన్నారు. హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలను పర్యటించేందుకు మోడీ విశాఖ వచ్చిన విషయం తెలిసిందే.
అంతకుముందు, విశాఖ విమానాశ్రయం సమీపంలోని ఐఎన్ఎస్ యాగాలో ప్రత్యేక విమానంలో మోడీ విశాఖకు చేరుకున్నారు. ముందుగా తుపాను ధాటికి ధ్వంసమైన విశాఖ విమానాశ్రయాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను చూశారు. బాబుతో కారులో వచ్చిన మోడీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
తుపాను ప్రాంతాల్లో రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ల పరిస్థితిపై చంద్రబాబు, ఇతర అధికారులతో రివ్యూ చేశారు. అక్కడి నుంచి నేరుగా ఫిషింగ్ హార్బర్కు చేరుకుని తుపాను కారణంగా ధ్వంసమైన బోట్లను పరిశీలించారు. అనంతరం రోడ్డు మార్గాన జాలారిపేట తదితర ప్రాంతాలను సందర్శించారు. అనంతరం ఢిల్లీకి బయలుదేరారు.