మద్దతివ్వబోం: దాద్రి ఘటనపై మౌనం వీడిన మోడీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కలకలం రేపిన దాద్రి ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎట్టకేలకు నోరు విప్పారు. దాద్రి తరహా ఘటనలు విచారకరమని పేర్కొన్న ఆయన ఈ తరహా ఘటనలకు భారతీయ జనతా పార్టీ మద్దతివ్వబోదని తేల్చిచెప్పారు.
గోమాంసం తిన్నారన్న అనుమానంతో ఉత్తరప్రదేశ్ లోని దాద్రి గ్రామంలో అఖ్లాఖ్ అనే ముస్లిం వ్యక్తిపై కొందరు హిందువులు దాడి చేశారు. ఈ ఘటనలో అఖ్లాఖ్ చనిపోగా, ఆయన కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
దీనిపై స్పందించేందుకు తొలుత కేంద్ర మంత్రులు వెనకడుగు వేసినా, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు స్పందించారు. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు మంత్రులు ఈ ఘటనను ఖండించారు. ఇలాంటి ఘటనలను తమ ప్రభుత్వం సహించబోదని చెప్పారు.

అయితే ప్రధాని మోడీ మాత్రం మంగళవారం దాకా దీనిపై నోరు విప్పలేదు. దీంతో విపక్షాలన్ని మోడీపై విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో బెంగాల్కు చెందిన ఓ పత్రికతో మాట్లాడిన సందర్భంగా మోడీ.. దాద్రి ఘటనను ఖండించారు.
‘దాద్రి లాంటి ఘటన నిజంగా విచారకరం. ఈ ఘటనల వెనుక కీలక అంశమేంటి? ఇలాంటి ఘటనలకు బిజెపి మద్ధతివ్వబోదు. ఈ తరహా ఘటనలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. వాటి బూటకపు లౌకికత్వానికి బిజెపి విరుద్ధం' అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ గాయకుడు గులాం అలీపై జరిగిన వివాదాన్ని కూడా మోడీ ఖండించారు. ఇలాంటి ఘటనలు విచారకరమని అన్నారు.












Click it and Unblock the Notifications