సంతలో పశువులను కొన్నట్లు కర్నాటక ఎమ్మెల్యేలను మోడీ కొంటున్నారు: చంద్రబాబు
కోల్ కతా: కోల్కతాలో బీజేపీకి వ్యతిరేకంగా జరిగిన భారీ ర్యాలీలో పలువురు బీజేపీయేతర పార్టీ నాయకులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన ఈ మెగా ర్యాలీకి ప్రజలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు జాతీయ స్థాయి నేతలు కూడా హాజరై మోడీ సర్కార్ విధానాలను ఎండగట్టారు.
ప్రజలతో కిక్కిరిసిపోయిన బ్రిగేడ్ గ్రౌండ్స్
సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని నెలలు సమయం ఉండటంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కోల్కతాలోని బ్రిగేడ్ గ్రౌండ్స్లో బీజేపీకి వ్యతిరేకంగా జరిగిన మెగా ర్యాలీలో బీజేపీయేతర నేతలు హాజరయ్యారు. మమతా బెనర్జీ నేతృత్వం వహించిన ఈ ర్యాలీకి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవడంతో ఇందుకు వేదికగా నిలిచిన బ్రిగేడ్ గ్రౌండ్స్ కిక్కిరిసిపోయింది. ఈ ర్యాలీలో పాల్గొన్న పలువురు సీఎంలు మోడీ సర్కార్పై దుమ్మెత్తి పోశారు. సభ మొత్తం మోడీ బీజేపీ లక్ష్యంగా సాగింది.
మోడీ పబ్లిసిటీ మాస్టర్ ...దేశానికి పనిచేసే ప్రధాని కావాలి
ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నరేంద్ర మోడీ పబ్లిసిటీ ప్రధానిగా అభివర్ణించిన బాబు... దేశానికి పనిచేసే ప్రధాని కావాలని అన్నారు. ఐదేళ్ల క్రితం ప్రజలు బీజేపీని గెలిపించారని.. కానీ వారు దేశాన్ని ముంచేశారని వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా చాలా మాటలు చెప్పారని గుర్తు చేశారు చంద్రబాబు. జన్ధన్, ముద్రలోన్, మంచి పాలన, స్మార్ట్ సిటీలు, నల్లధనం తిరిగి దేశానికి రప్పించడం, రెండు కోట్ల ఉద్యోగాలు , అచ్చే దిన్ లాంటి నినాదాలు ఇచ్చారని ఇప్పుడు చూస్తే ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు చంద్రబాబు. కేవలం పబ్లిసిటీ మాత్రమే చేశారు తప్పితే చేతల్లో ఏమి చేయలేదని ధ్వజమెత్తారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తారన్న ప్రధాని దాన్ని విస్మరించారని దుయ్యబట్టారు. కనీస మద్దతు ధర రైతుకు లభించడం లేదని చెప్పారు. దేశంలో వ్యవసాయ వృద్ధి రేటు పడిపోయిందని చెప్పారు.
సీబీఐ ఈడీలను దుర్వినియోగం చేస్తున్నారు
రాఫెల్ యుద్ధ విమానాల స్కామ్పై మాట్లాడిన చంద్రబాబు... దేశాన్నే కాదు సుప్రీంకోర్టులో తప్పుడు అఫడవిట్లు సమర్పించి కోర్టును సైతం పక్కదోవ పట్టించారని మోడీ సర్కార్పై నిప్పులు చెరిగారు చంద్రబాబు. అంతేకాదు స్వతంత్ర సంస్థలను తమ స్వలాభం కోసం వినియోగించుకుంటోందన్న చంద్రబాబు... సీబీఐ ఈడీ లాంటి సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. అంతేకాదు కర్నాటకలో కుమార స్వామి ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నం బీజేపీ మోడీ చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. కర్నాటకలో ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొనేందుకు మోడీ సర్కార్ ప్రయత్నిస్తోందని అన్నారు. దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే తమ ముందున్న కర్తవ్యం అని చంద్రబాబు అన్నారు.
నిజాలు మాట్లాడితే మోడీకి బీజేపీకి నచ్చవు
ఇక రెబల్ ఎంపీ శతృఘ్నసిన్హా మోడీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. నిజం మాట్లాడితే తిరుగుబాటు తనమే అవుతుందంటే తాను తిరుగుబాటుదారుడినే అని అన్నారు. తను బీజేపీ ఎంపీ అయినప్పటికీ... ముందు దేశం తనకు ముఖ్యమని ఆ తర్వాతే పార్టీ అని అన్నారు. నాడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఎలా ఉండేది నేడు మోడీ సర్కార్ ఎలా ఉంది అంటూ నిప్పులు చెరిగారు శతృఘ్న సిన్హా. బీజేపీకి నిజం మాట్లాడితే సరిపోదని విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం మోడీ సర్కార్ ఒక నియంతలా వ్యవహరిస్తోందని శతృఘ్న సిన్హా ధ్వజమెత్తారు.
దేశం కొత్త ప్రధానికోసం ఎదురు చూస్తోంది
మొత్తం 23 పార్టీలకు చెందిన నాయకులు ఈ మెగా ర్యాలీలో పాల్గొన్నారని మమతా బెనర్జీ అన్నారు. ఇక మోడీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ధ్వజమెత్తారు దీదీ. దేశం కొత్త ప్రధాని కోసం ఎదురు చూస్తోందని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఎన్డీఏ హయాంలో మానవహక్కులు మంటకలిసిపోతున్నాయని ధ్వజమెత్తారు. అంతేకాదు ఉత్తర్ ప్రదేశ్లో బీజేపీని పంపించే బాధ్యత అఖిలేష్ తీసుకోవాలని బెంగాల్లో ఆ బాధ్యత తను తీసుకుంటుందని మమతా అన్నారు.