మన్ కీ బాత్ షాదీ.. మోడీ మాటలే పెళ్లి మంత్రాలు
మంగళూరు : ప్రధాని నరేంద్ర మోడీపై అభిమానం వెల్లివిరుస్తోంది. మరోసారి మోడీని ప్రధానిని చేయాలనే ఆకాంక్ష బలపడుతోంది. ఆ క్రమంలో కొందరు యువకులు వినూత్న ఆలోచనలకు తెరలేపుతున్నారు. దేశంతో పాటు మోడీపై ఉన్న అభిమానంతో తమ పెళ్లిళ్లను వినూత్నంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదివరకు వివిధ కాన్సెప్టులతో వెడ్డింగ్ కార్డులు రూపొందిస్తే.. తాజాగా ఓ జంట మోడీ మాటలనే పెళ్లి మంత్రాలుగా మలచుకుంది. మోడీ మళ్లీ వస్తేనే దేశం బాగుపడుతుందనే ఆలోచనలతో పెళ్లిళ్లు జరుగుతుండటం విశేషం.
వేదమంత్రాలుగా మోడీ స్పీచ్
మోడీకి ఓటు వేయాలంటూ దేశవ్యాప్తంగా పలుచోట్ల వెడ్డింగ్ కార్డులు దర్శనమిస్తున్నాయి. గిఫ్టులొద్దు, ఏమీ వద్దు.. బీజేపీకి ఓటు వేస్తే చాలనే కాన్సెప్టుతో మ్యారేజ్ కార్డులు ముద్రించిన సందర్భాలున్నాయి. ఆ క్రమంలో ఆదివారం (24.02.2019) నాడు మంగళూరులో జరిగిన పెళ్లి ప్రాధాన్యత సంతరించుకుంది.
బీజేపీ కార్యకర్త జయరామ్ తన పెళ్లి ఏర్పాట్లను వినూత్నంగా ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మాటలను వేదమంత్రాలుగా మలుచుకున్నారు. ప్రధాని 53వ మన్ కీ బాత్ ప్రసార సమయాన్ని తన పెళ్లి ముహుర్తంగా ఫిక్స్ చేసుకున్నారు జయరామ్. వివాహ సమయంలో మోడీ మాటలు వింటూ వధువు మెడలో తాళి కట్టారు. మన్ కీ బాత్ ప్రసారం కోసం రేడియోతో పాటు స్పీకర్లు ఏర్పాటు చేసుకుని పెళ్లి తంతు ముగించారు.
గిఫ్టులొద్దు.. ఓటేస్తే చాలు
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డులు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మోడీకి మరోసారి పట్టం కట్టాలని కోరుతూ పలువురు మ్యారేజీ కార్డులు ముద్రిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఇలాంటి కార్డులు ఇటీవలి కాలంలో విరివిగా దర్శనమిస్తున్నాయి. ఆ క్రమంలో ఇటీవల శంషాబాద్ కు చెందిన ముఖేశ్ పెళ్లి కార్డు కూడా చర్చానీయాంశంగా మారింది. బీజేపీ పాలనను, మోడీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా కమలం గుర్తుకు ఓటేయ్యాలని పెళ్లి కార్డుల్లో ముద్రించారు. వివాహానికి హాజరయ్యే బంధుమిత్రులు గిఫ్టులు తీసుకురావొద్దని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే చాలనే విధంగా మ్యాటర్ ప్రింట్ చేయించారు.
శుభలేఖలో రాఫెల్.. మోడీయే ది బెస్ట్
మోడీ నాయకత్వాన్ని కోరుకుంటూ ముద్రిస్తున్న పెళ్లి కార్డుల్లో రాఫెల్ వివాదానికి కూడా చోటు దక్కింది. జనవరి 22వ తేదీన సూరత్ లో పెళ్లి చేసుకున్న యువరాజ్, సాక్షి అగర్వాల్ మ్యారేజ్ కార్డును డిఫరెంట్ గా తీర్చిదిద్దారు. రాఫెల్ వద్దు.. మోడీని నమ్మండంటూ ముద్రించిన ఆ కార్డు సాక్షాత్తూ మోడీ దృష్టిని ఆకర్షించడం విశేషం. అంతేకాదు ఆయన స్వయంగా ఆ కొత్త దంపతులకు ఈ మెయిల్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. శుభలేఖలో చాలా ప్రత్యేకత ఉందని, మీకున్న దేశభక్తి అలా చాటుకోవడం గర్వించదగ్గ విషయమని కితాబిచ్చారు. మీరిచ్చిన స్ఫూర్తితో దేశం కోసం ఇంకా కష్టపడి పనిచేయాలని ఉందని చెప్పుకొచ్చారు.
కార్డు మొత్తం మోడీ పాలనే..!
ఇక ట్విట్టర్ వేదికగా హల్ చల్ చేసింది మరో పెళ్లి కార్డు. మోడీ ఈ నాలుగున్నరేళ్లల్లో ఏం చేశారనేది పూసగుచ్చినట్లు వివరించారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు.. ఇలా అన్నింటినీ రంగరించి శుభలేఖలో ముద్రించారు. మోడీ మరోసారి ప్రధాని అయితేనే దేశం బాగుపడుతుందనే రీతిలో సందేశమిచ్చారు. మోడీని మనం గెలిపిస్తే.. ఆయన మనల్ని మంచిగా చూసుకుంటారనే విషయం పొందుపరిచారు. మొత్తానికి రానున్న లోక్ సభ ఎన్నికలు ఏమోగానీ, ఈ పెళ్లిళ్ల సీజన్ లో ఇంకా ఇలాంటివి మరెన్ని కార్డులు వస్తాయో చూడాలి.