సత్తా వుంది: మోడీపై అద్వానీ, నేర్చుకున్నాన్న మోడీ
అద్వానీతోపాటు నరేంద్ర మోడీ కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో భారీగా కార్యకర్తలు వారి వెంట తరలివచ్చారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి రెండెంకల స్థాయి స్థానాలు రావని, కొన్ని రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేని స్థితిలో కాంగ్రెస్ ఉందని అన్నారు.
గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని, రాష్ట్రంలోని 28 స్థానాల్లో బిజెపి గెలుస్తుందని నరేంద్ర మోడీ అన్నారు. బిజెపి లాంటి పార్టీలో ఉండి చేయడం తన అదృష్టమని చెప్పారు. బిజెపి అగ్రనేత అద్వానీ నుంచి తాను చాలా నేర్చుకున్నానంటూ ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తారు. పార్టీ ఉన్నతి కోసం అద్వానీ ఎంతో కష్టపడ్డారని మోడీ తెలిపారు.
అనంతరం ఎల్కె అద్వానీ మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ సమర్థత గల నాయకుడని, ఆయన దేశానికి మంచి ప్రధాని అవుతారని ప్రశంసించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని, బిజెపి గెలుపు ఖాయమని చెప్పారు. తనతో ఎంతో అనుబంధం కలిగిన గాంధీనగర్ లోకసభ స్థానం నుంచి మళ్లీ పోటీ చేయడం ఆనందంగా ఉందని అద్వానీ తెలిపారు.