21న హాజరవండి: నేషషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీకి ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో మరోసారి కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో జూలై 21న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఈడీ సోమవారం సోనియా గాంధీని కోరారు. జూన్ నెలలో, కోవిడ్ -19 కారణంగా ఒక వారం పాటు ఆసుపత్రిలో ఉన్న సోనియా గాంధీ తన అనారోగ్యం గురించి ఈడీకి లేఖ రాశారు. విచారణను వాయిదా వేయాలని వారిని అభ్యర్థించారు. ఈడీ ఆమె అభ్యర్థనను ఆమోదించింది.
జూన్ 2న ఆమెకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. 75 ఏళ్ల సోనియా గాంధీ జూన్ 20న ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నాయకురాలిని మొదట జూన్ 8న ప్రశ్నించడానికి ఏజెన్సీ పిలిచింది. అయితే, ఆమె తన కోవిడ్-19 ఇన్ఫెక్షన్ దృష్ట్యా ప్రోబ్ ఏజెన్సీ నుంచి మరింత సమయం కోరారు. ఈడీ ఆ తర్వాత సమన్లు జారీ చేసి జూన్ 23న హాజరుకావాలని కోరింది.
"సోనియా గాంధీ సమన్లను నాలుగు వారాలపాటు వాయిదా వేయాలనికోరారని, అందుకే జూలై 21న ఏజెన్సీ ముందు హాజరుకావాలని కోరింది' అని ఈఢీ అధికారులు వెల్లడించారు. ఐదు రోజుల ప్రశ్నోత్తరాల సమయంలో రాహుల్ గాంధీని అడిగిన ప్రశ్నలనే సోనియా గాంధీని అడగనున్నట్లు IANSలో ఒక నివేదిక పేర్కొంది.
"యంగ్ ఇండియా, అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ (ఏజేఎల్) మధ్య ఒప్పందంలో ఆమె పాత్ర గురించి మేము అడగాలి" అని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.
కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని దర్యాప్తు సంస్థ ఇప్పటికే ఐదు రోజుల పాటు 50 గంటలకు పైగా ప్రశ్నించింది. యంగ్ ఇండియన్ లిమిటెడ్ (వైఐఎల్) యాజమాన్యం, నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను నిర్వహిస్తున్న సంస్థ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఎజెఎల్)లో దాని వాటా తీరుపై గాంధీని ఈడీ అధికారులు అడిగినట్లు తెలిసింది.
దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం ద్వారా కేంద్రం ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటోందని కాంగ్రెస్ ఆరోపించింది. మొత్తం చర్యను "రాజకీయ ప్రతీకారం"గా అభివర్ణించింది.