మహిళా రిజర్వేషన్: మహిళలకు టికెట్ కేటాయింపుల్లో నిరాశ కల్గించిన జాతీయపార్టీలు
పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుకు కాంగ్రెస్ బేషరతుగా మద్దతు ఇస్తుందని ప్రకటించి బీజేపీని ఇరుకున పెట్టారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఇదే సంగతి ట్విటర్ ద్వారా తెలిపారు. ఆపై ప్రధాని నరేంద్ర మోడీకి కూడా లేఖ రాశారు. మహిళా సాధికారికతపై బహిరంగ సభల్లో మాట్లాడే ప్రధాని...నిజంగా మహిళలపట్ల గౌరవం చిత్తశుద్ధి ఉంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని సవాల్ విసిరారు. అందుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు.
ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇదే అంశం హాట్ టాపిక్గా ట్రెండింగ్లో నిలిచింది. ఇంతవరకు బాగానే ఉంది.. అయితే రాజకీయపార్టీలకు నిజంగానే మహిళా రిజర్వేషన్లపై ఏమేరకు చిత్తశుద్ధి ఉంది అనేది ఒకసారి చూద్దాం. 2014 లోక్సభ ఎన్నికల్లో ఏయే పార్టీలు ఎంతమంది మహిళలకు టికెట్లు ఇచ్చాయో ఒకసారి గమనిద్దాం.
మహిళలకు టికెట్ల కేటాయింపుల్లో జాతీయ పార్టీల చిన్నచూపు
ప్రస్తుతం ఉన్న 16వ లోక్సభలో 62 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. మొత్తం మీద 11శాతం మంది మహిళా ఎంపీలు ఉన్నారు. గతలోక్ సభ ఎన్నికల్లో మొత్తం 8251 మంది అభ్యర్థులు బరిలో నిలువగా అందులో 668 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఇందులో 206 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే..జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు మహిళా అభ్యర్థులకు నిజంగానే అన్యాయం చేశాయి. ఒక్క తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం మహిళా అభ్యర్థులకు చెప్పుకోదగ్గ న్యాయం చేయగలిగింది.
గత ఎన్నికల్లో మహిళలకు రాజకీయపార్టీలు ఇచ్చిన టికెట్లు
2014 లోక్ సభ ఎన్నికల్లో 282 సీట్లు గెలిచిన అధికారిక బీజేపీ పార్టీ... కేవలం 38 మంది మహిళలకే టికెట్లు ఇచ్చింది. అయితే బీజేపీ పోటీ చేసిన స్థానాలు 428గా ఉన్నాయి. మొత్తం మీద బీజేపీ మహిళలకు 8.8 శాతం సీట్లు మాత్రమే కేటాయించింది
ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విషయానికొస్తే హస్తం పార్టీ మొత్తం గెలిచిన సీట్లు 44. 464 సీట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయగా... అందులో 60 స్థానాలను మహిళా అభ్యర్థులకు కేటాయించింది.దీంతో కాంగ్రెస్ మహిళలకు కేటాయించిన స్థానాల శాతం 12.9శాతంగా ఉంది. అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ 439 స్థానాల్లో పోటీచేయగా 13.4 శాతం స్థానాలను మహిళలకు కేటాయించింది. మొత్తం మీద 59 మంది మహిళలు ఆమ్ ఆద్మీ నుంచి పోటీ చేశారు.
మహిళలకు ప్రాంతీయ పార్టీలు కేటాయించిన స్థానాలు
జాతీయ పార్టీలు మహిళలకు తక్కువగా స్థానాలు కేటాయించగా... అదే ప్రాంతీయ పార్టీలు మాత్రం ఈ విషయంలో కాస్త ఫర్వాలేదనిపించాయి. ముఖ్యంగా బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు చెప్పుకోదగ్గ స్థానాలను కేటాయించగా... అదే మాయావతి బీఎస్పీ పార్టీ, దివంగత నేత జయలలిత అన్నాడీఎంకే పార్టీలు మహిళలకు కేటాయించిన స్థానాల సంఖ్య చూస్తే నిరాశ కలుగుతుంది. తృణమూల్ కాంగ్రెస్ 45 సీట్లలో పోటీ చేస్తే అందులో 15 మంది మహిళా అభ్యర్థులే ఉన్నారు. ఇందులో మమతా బెనర్జీ కచ్చితంగా 33 శాతం టికెట్లను మహిళలకు కేటాయించారు. తద్వారా తాము మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు పరోక్ష సంకేతాలు ఇచ్చారు.
అన్నాడీఎంకే 10శాతం..బీఎస్పీ 5.3శాతం
ఇదిలా ఉంటే జయలలితా పార్టీ అన్నాడీఎంకే 10శాతం మాత్రమే మహిళా అభ్యర్థులకు టికెట్లు కేటాయించింది.40 సీట్లలో పోటీ చేసిన అన్నాడీఎంకే పార్టీ 4 స్థానాలనే మహిళలకు కేటాయించింది. ఇక మాయావతి పార్టీ బీఎస్పీ అయితే మహిళా అభ్యర్థులకు సీట్లు కేటాయించడంలో మరి దిగజారినట్లు కనిపించింది. పార్టీ అధ్యక్షురాలే ఒక మహిళగా ఉండి మహిళలకు టికెట్లు కేటాయించకపోవడంపై మాయావతిపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. 503 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ కేవలం 27 మంది మహిళా అభ్యర్థులకే టికెట్లు కేటాయించింది. అంటే 5.3శాతం మంది మహిళలకే టికెట్లు ఇవ్వడం చూస్తే ఆపార్టీకి మహిళలపై ఉన్న గౌరవం ఏపాటిదో ఇట్టే తెలుస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.