దేశంలోనే నవీన్ పట్నాయక్ సంచలనం .. ఎన్నికల్లో 33 శాతం మహిళలకు సీట్లు
దేశంలో ఎన్నికలు జరుగుతున్న వేళ సంచలన నిర్ణయం తీసుకొని దేశానికే ఆదర్శం అయ్యారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ . తమ పార్టీ నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి ముగ్గురిలో ఒక మహిళ ఉంటుందని ప్రకటన చేశారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ అయిన బీజూ జనతా దళ్ నుంచి మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించారు. మహిళా స్వయం సహాయ బృందం (ఎస్హెచ్జీ) సమావేశంలో పాల్గొన్న పట్నాయక్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా సంచలనం సృష్టించిన నవీన్ పట్నాయక్ మహిళలకు గౌరవం కల్పిస్తూ తీసుకున్న సంచలన నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది.
మోగిన నగారా: లోకసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, ఏపీ-తెలంగాణల్లో ఏప్రిల్ 11న ఎన్నికలు
సీఎం నవీన్ పట్నాయక్ నిర్ణయంపై పార్టీ కార్యకర్తలతో పాటూ మహిళా సంఘాలు పెద్దఎత్తున ఆనందం వ్యక్తం చేశారు. చట్టసభల్లో మహిళలకు సరైన ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగాలని ఆయన సూచించారు. మహిళా సాధికారత అంటూ వ్యాఖ్యలు చేస్తున్న జాతీయ పార్టీలు కూడా తమ మాటపై నిలబడి.. ఆ దిశగా అడుగులు వేయాలంటున్నారు పట్నాయక్. మన దేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడాలన్నా.. ప్రపంచానికి నాయకత్వం వహించాలన్నా మహిళా సాధికారతే ముఖ్యమన్నారు. దేశంలో మహిళా సాధికార సాధించేందుకు ఒడిశాలోని మహిళలు నాయకత్వం వహిస్తారని అభిప్రాయపడ్డారు.
మహిళలకు లోక్సభ, శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా మద్దతు తెలుపుతూ పట్నాయక్ గతేడాది ఒడిశా అసెంబ్లీలో ప్రతిపాదన తీర్మానాన్ని ఆమోదించారు . ఇప్పుడు 33శాతం సీట్లు మహిళలకు ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచారు.