సిద్ధూ ఓ మానవబాంబు, ద్రోహి, తల్లిని మార్చేస్తాడా!: సుఖ్బీర్-హర్సిమ్రాత్
కాంగ్రెస్ పార్టీలో చేరిన నవజ్యోత్ సింగ్ సిద్ధు పైన పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్, కేంద్రమంత్రి హర్ సిమ్రాత్ కౌర్ బాదల్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చండీగఢ్: కాంగ్రెస్ పార్టీలో చేరిన నవజ్యోత్ సింగ్ సిద్ధు పైన పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్, కేంద్రమంత్రి హర్ సిమ్రాత్ కౌర్ బాదల్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిద్ధూ ద్రోహి అని, బీజేపీని మోసగించాడన్నారు.
మాతృసంస్థపై కౌంటర్
కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే మళ్లీ మాతృ సంస్థలోకి రావడమని సిద్ధూ అన్నారు. దీనిపై సుఖ్ బీర్, హర్ సిమ్రాత్ దుయ్యబట్టారు. సిద్ధు మానవబాంబు లాంటివాడన్నారు. అతడు ఆరు నెలల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం ఖాయమన్నారు. కావాలంటే రాసిస్తామని చెప్పారు.
తల్లిని మార్చేస్తారా!
సిద్ధూ ప్రతి రెండు రోజులకు ఒకసారి తన తల్లిని మార్చేస్తారని, ఆయనకు ఎంతమంది తల్లులు (పార్టీలు) ఉన్నారో అడగాలనుకుంటున్నారనని వ్యాఖ్యానించారు.
సిక్కులను ఊచకోత కోసిన పార్టీలో..
సిక్కులను ఊచకోత కోసిన పార్టీలోకి వెళ్లి, దానిని ఘర్ వాపసీ అని చెప్పడం విడ్డూరమన్నారు. కొంతమంది వ్యక్తులు తమ కాళ్లను రెండు పడవల మీద కాకుండా మూడు పడవల మీద పెడతారని ఎద్దేవా చేశారు.
పాక్లో చేరవచ్చు..
కొన్నాళ్లు బీజేపీ, మరికొన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ అంటారని, ఇంకొంత దూరం వెళ్లి పాకిస్తాన్లో కూడా చేరవచ్చునని అన్నారు.
కేజ్రీవాల్ పైన..
ఢిల్లీ ముఖ్యంత్రి, ఏఏపీ నేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతో ప్రతి దానికి ప్రధాని మోడీని వ్యతిరేకించడమే అజెండాగా పెట్టుకున్నారన్నారు. పంజాబ్లో 70 శాతం మంది ఎప్పుడూ మత్తులో ఉంటారని రాహుల్ గాంధీ చెబుతున్నారని, కానీ అందరికంటే ఎక్కువగా ఆయనే ఉంటారేమో అన్నారు.