మహా సీన్: ప్రభుత్వానికి ఎన్సీపి మద్దతు వెనక్కి
ముంబై: కాంగ్రెసు నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వానికి శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ (ఎన్సిపి) మద్దతు ఉపసంహరించుకుంటోంది. తమ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటుందని ఎన్సీపి నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ శుక్రవారంనాడు చెప్పారు. ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని కూడా ఆయన చెప్పారు. దీంతో మహారాష్ట్రలో కాంగ్రెసు, ఎన్సీపిల 15 ఏళ్ల బంధం తెగిపోయినట్లే.
ప్రస్తుత చీలికకు ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ కారణమని అజిత్ పవార్ ఆోరపించారు. గత ముఖ్యమంత్రులు ఎవరు కూడా తమను నిర్లక్ష్యం చేయలేదని ఆయన అన్నారు. తాను ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

ఎన్సీపి శాసనసభా పక్ష నేత శనివారం గవర్నర్ను కలిసి కాంగ్రెసు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటూ లేఖ ఇచ్చే అవకాశం ఉంది. కూటమిని కాపాడడానికి తాము శత విధాలా ప్రయత్నించామని, అయితే ఎన్సిపీ ముందు వేసుకున్న పథకం ప్రకారమే కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు అనిపిస్తోందని కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి మోహన్ ప్రకాశ్ అన్నారు.
కాగా, మహారాష్ట్ర తాజా పరిణామాలపై గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపే అవకాశం ఉంది. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు, ఎన్సీపిల మధ్య సీట్ల సర్దుబాటుపై అవగాహన కుదరలేదు. ఇరు పార్టీలు తమ తమ వాదనలకే కట్టుబడి మెట్టు దిగడానికి ఇష్టపడలేదు. దీంతో పొత్తు బెడిసికొట్టింది.












Click it and Unblock the Notifications