Mood of the Nation: ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే- లాటరీ.. ఆ పార్టీదే: బంపర్ మెజారిటీ
Chandrababu Naidu: రాష్ట్రంలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి 164 అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించింది. టీడీపీ- 135, జనసేన- 21, బీజేపీ- 8 నియోజకవర్గాల్లో జయకేతనాన్ని ఎగురవేశాయి. అలాగే- 22 లోక్ సభ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయదుందుభి మోగించారు.
టీడీపీ సాధించిన ఈ తిరుగులేని విజయం అప్పట్లో జాతీయస్థాయిలో అందరినీ ఆకర్షించింది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా టీడీపీ మద్దతు సైతం అవసరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీకి ఉన్న 16 మందితో పాటు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు చెందిన జనతాదళ్ (యునైటెడ్) చెందిన 12 మంది ఎంపీల మద్దతుతోనే కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.

ఈ పరిస్థితుల మధ్య తాజాగా ఇండియాటుడే- సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే విడుదలైంది. ప్రధానిమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసి, 14 నెలల కాలం పూర్తయిన నేపథ్యంలో ఈ సర్వే వెల్లడైంది. ఎన్డీఏ, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా బ్లాక్ స్థితిగతులేమిటనేది తేల్చి పడేసింది.
తాజా సర్వే ప్రకారం- ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే.. ఎన్డీఏ కూటమికి 324 సీట్లు లభిస్తాయి. ప్రస్తుతం బీజేపీకి ఉన్న సీట్ల బలం 240 మాత్రమే. ఇప్పుడు తాజాగా ఎన్నికలను ఎదుర్కొనాల్సి వస్తే 300ల మార్క్ ను అందుకుంటుంది బీజేపీ. 324 స్థానాలతో నాలుగోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
అదే సమయంలో- ఇండియా బ్లాక్ 208 నియోజకవర్గాలకే పరిమితమవుతుంది. ప్రస్తుతం లోక్ సభలో ఈ బ్లాక్ కు ఉన్న సీట్ల సంఖ్య 234. ఇతరులకు 11 సీట్లు దక్కుతాయి. ఈ 14 నెలల కాలంలో దేశంలో చోటు చేసుకున్న పరిణామాలు.. ఎన్డీఏకు ప్లస్ పాయింట్ అయ్యాయని ఇండియాటుడే- సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ అంచనా వేసింది.
ఈ ఏడాది జూలై 1 నుండి ఈ నెల 14వ తేదీ వరకు ఇండియా టుడే- సీ ఓటర్ ఈ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని లోక్సభ నియోజకవర్గాల నుంచి 54,788 మంది అభిప్రాయాలను సేకరించింది. దీనికితోడు సీ- ఓటర్ రెగ్యులర్ ట్రాకర్ డేటా నుంచి 1,52,038 ఇంటర్వ్యూలను కూడా పరిగణనలోకి తీసుకుంది. దీన్నీ విశ్లేషించింది.
మొత్తంగా ఈ సర్వే కోసం 2,06,826 మంది ఓటర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది. హర్యానా, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కమలం ప్రభంజనం వీస్తుందని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఎన్డీఏ కూటమికి 343 సీట్లు లభించాయి. ఇప్పుడీ సంఖ్య స్వల్పంగా తగ్గింది.












Click it and Unblock the Notifications