90 శాతం భారత్లో కరోనా హై పాజిటివిటీ రేటు... కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి...
దాదాపు 90 శాతం భారత్లో కోవిడ్ పాజిటివిటీ రేటు అధికంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్తగా హిమాచల్ ప్రదేశ్,నాగాలాండ్ రాష్ట్రాల్లోనూ పాజిటివిటీ రేటు అధిక స్థాయికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతినిధి లావ్ అగర్వాల్ పేర్కొన్నారు. దేశంలో కరోనా పరిస్థితులపై మంగళవారం(మే 11) నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబ,ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు,ఐసీఎంఆర్ ప్రతినిధులు పాల్గొని చర్చించారు.
రాజీవ్ గౌబ మాట్లాడుతూ... కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో టెలీ కన్సల్టేషన్ హెల్ప్ లైన్స్,వలంటీర్లు,ఎన్జీవోలు,సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా వీటన్నింటిని సమన్వయం చేయాలన్నారు. రాష్ట్రాల్లో వైద్యపరమైన మౌలిక సదుపాయాలను,ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు,హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను పెంచాల్సిన అవసరంపై చర్చించారు. కోవిడ్ మేనేజ్మెంట్ కోసం అవసరమైన మానవ వనరులను సమకూర్చుకోవాలన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు.
టెస్టింగ్,కంటైన్మెంట్,ఇన్ఫ్రాస్ట్రక్చర్... రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ మూడు అంశాలపై విజ్ఞప్తులు అందుతున్నట్లు సమావేశంలో చర్చించారు.గత వారంలో కరోనా పాజిటివిటీ రేటు 10శాతం లేదా అంతకన్నా ఎక్కువ ఉండి,ఆస్పత్రుల్లో బెడ్ల ఆక్యుపెన్సీ 60 శాతం కన్నా ఎక్కువగా ఉన్న జిల్లాలను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్లు పేర్కొన్నారు. ఆ జిల్లాల్లో రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిని నియమించి 14 రోజుల పాటు అక్కడి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించినట్లు తెలిపారు. జిల్లాల కలెక్టర్లు రోజువారీ సమీక్ష సమావేశాలు నిర్వహించాలన్నారు.
దేశంలో కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గోవా టాప్లో ఉన్నది. ఆ అక్కడ 48శాతం పాజిటివిటీ రేటు ఉంది. ఆ తర్వాతి స్థానంలో 37శాతం పాజిటివిటీ రేటుతో హర్యానా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో ఆరు రాష్ట్రాల్లో 50 వేల నుంచి 1లక్ష యాక్టివ్ కేసులు ఉన్నాయి. మిగతా 17 రాష్ట్రాల్లో 50వేల కన్నా తక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనా సెకండ్ వేవ్ మే మధ్య నాటికి పీక్స్కి చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నప్పటికీ... కచ్చితమైన సమాచారం మాత్రం లేదు. కరోనా థర్డ్ వేవ్ కూడా తప్పదని నిపుణులు చెబుతున్నారు. అయితే అది ఎప్పుడు మొదలవుతుందన్న దానిపై కచ్చితమైన అంచనా లేదని అంటున్నారు.