Earthquake: వణికిన ఢిల్లీ- రాత్రంతా జాగారం..!!
ఖాట్మండూ: నేపాల్లో పెను భూకంపం సంభవించింది. నేపాల్ పశ్చిమ దిశలో సంభవించిన ఈ భూకంప తీవ్రత అనూహ్యంగా నమోదైంది. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. ఢిల్లీ-నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిపైనా దీని ప్రభావం పడింది. దేశ రాజధానివాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రాత్రంతా జాగారం చేశారు. ప్రకంపనల తీవ్రత తగ్గకపోవడం వల్ల ఇళ్లల్లోకి వెళ్లడానికీ భయపడ్డారు. ఎముకలు కొరికే చలిలోనూ రోడ్లపైనే గడిపారు.
నేపాల్లో సంభవించిన భూకంప తీవ్రత 6.6గా నమోదైంది. కొన్ని గంటల వ్యవధిలో వరుసగా మూడుసార్లు భూమి ప్రకంపించింది. ప్రధాన భూకంపం తరువాత కూడా ప్రకంపనలు సంభవించాయి. తొలి భూకంపం రాత్రి 9:07 నిమిషాలకు నమోదైంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా రికార్డయింది. ఆ తరువాత 9.56 నిమిషాలకు మళ్లీ భూమి ప్రకంపించింది. దీని తీవ్రత 4.1. అలాగే అర్ధరాత్రి దాటిన తరువాత 2.12 నిమిషాలకు మరోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత అధికంగా కనిపించింది. రిక్టర్ స్కేల్పై 6.6గా నమోదైంది.
నేపాల్ పశ్చిమ ప్రాంతంలోని దోటీ జిల్లాలోని పూర్బీ చౌకీ గ్రామం సమీప ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపింది. ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకన్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు వివరించింది. భూకంపం ధాటికి పూర్బీ చౌకీ కౌన్సిల్ 3 ప్రాంతంలో ఆస్తినష్టం సంభవించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. పలు నివాసాలు కుప్పకూలాయని, ఈ ఘటనలో ఆరుమంది మరణించినట్లు పేర్కొన్నారు.
ఈ భూకంప తీవ్రత ఢిల్లీ-ఎన్సీఆర్పై పడింది. ఢిల్లీతో పాటు ఈ నగరానికి ఆనుకుని ఉండే ఘజియాబాద్, గ్రేటర్ నొయిడాల్లో పలుచోట్ల భూమి ప్రకంపించింది. అర్ధరాత్రి దాటిన తరువాత 1.57 నిమిషాలకు ఎన్సీఆర్ పరిధిలో భూప్రకంపనలు సంభవించాయి. ఆ తరువాత కూడా వాటి తీవత్ర తగ్గకపోవడం వల్ల స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లోకి వెళ్లడానికి వెనుకాడారు. రోడ్లపై గడిపారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. నొయిడాలోని సాఫ్ట్వేర్ కంపెనీల ఉద్యోగులు తమ అనుభవాలను వివరించారు.