నర్సులా వెళ్లింది: పసికందును మాయం చేసింది
మధుర: ఓ మాయలేడి నర్సులా వెళ్లి పురిటి బిడ్డను ఎత్తుకుని అక్కడి నుంచి చిన్నగా జారుకుంది. బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లి ఆర్తనాదాలు చేస్తున్నది. ఉత్తరప్రదేశ్ లోని మధుర ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజుల పసికందును దొంగలించారు.
మధురలోని నవనీత్ నగర్ కు చెందిన నస్రీన్ జనవరి 29న మగబిడ్డను ప్రసవించింది. సోమవారం ఓ మహిళ నర్సులా అక్కడికి వెళ్లింది. పిల్లాడికి వాక్సిన్ వేయిస్తానని మాయమాటలు చెప్పి నస్రీన్ నుంచి పసికందును తీసుకుంది.
పిల్లాడిని తీసుకు వెళ్లిన ఆమె ఎంతకు రాకపోవడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆసుపత్రి సూపరింటెండెంట్ భాస్కర్ కు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో నస్రీన్ కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగుపొరుగు వారు ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు.
జిల్లా మెజిస్ట్రేట్ రాజేష్ కుమార్ ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. పిల్లాడు చోరీకి కారణమైన ముగ్గురు ఆసుపత్రి సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ భాస్కర్ మీద చర్యలు తీసుకోవాలని మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు పిల్లాడిని ఎత్తుకెళ్లిన మహిళ కోసం గాలిస్తున్నారు.