రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక
IRCTC train ticket reservation: రైలు టికెట్ల ముందస్తు రిజర్వేషన్ వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. నేటి నుంచి అవి అమలులోకి వచ్చాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి కొత్త నిబంధనలు కార్యరూపం దాల్చాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.
అడ్వాన్స్డ్ రైళ్ల రిజర్వేషన్ వ్యవస్థలో ఇండియన్ రైల్వేస్ క్యాటిరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఈ మార్పులు చేసిన విషయం తెలిసిందే. టికెట్ల బుకింగ్ గడువు కాలాన్ని 120 నుంచి 60 రోజులకు కుదించింది. ఈ మేరకు కిందటి నెల 21వ తేదీన ఓ ప్రకటన విడుదల చేసింది ఐఆర్సీటీసీ.

120 రోజులు ముందుగా రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం 2015 జనవరి 1వ తేదీన అమలులోకి వచ్చింది. ఈ విధానం వల్ల ప్రయాణ సమయానికి 21 శాతం మేర టికెట్లు రద్దయ్యేవి. మరో అయిదు శాతం మేర ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేయనప్పటికీ.. రైలు ప్రయాణం చేసే వాళ్లు కాదు.
మొత్తంగా 26 శాతం మేర టికెట్లు దుర్వినియోగం అయ్యేవని, అది ఇతర ప్రయాణికుల అడ్వాన్స్డ్ రిజర్వేషన్లపై తీవ్ర ప్రభావాన్ని చూపేవి. ఏకంగా ఇంత భారీ ఎత్తున టికెట్లు రద్దు కావడం వల్ల అడ్వాన్స్ రిజర్వేషన్ వ్యవస్థలో గందరగోళ పరిస్థితులు ఏర్పడేవి. దీన్ని అడ్డుపెట్టుకుని దళారులు భారీగా లాభపడుతున్నట్లు రైల్వే అధికారులు గుర్తించారు.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని టికెట్ల రిజర్వేషన్ గడువును సగానికి అంటే 120 నుంచి 60 రోజులకు కుదించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ శ్రీధర్ ఓ ప్రకటన విడుదల చేశారు. టికెట్ల బుకింగ్ గడువు కాలాన్ని కుదించడం వల్ల టికెట్ల రద్దు ఉండబోదని అన్నారు.
తమ ప్రయాణానికి సంబంధించిన ముందస్తు ప్రణాళికలను పక్కాగా అమలు చేయగలుగుతారని అభిప్రాయపడ్డారు. నిఖార్సయిన రైలు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని ఆయన హామీ ఇచ్చారు. దళారుల కార్యకలాపాలకు అడ్డుకట్ట పడినట్టవుతుందని తెలిపారు.












Click it and Unblock the Notifications