సెప్టెంబర్ 1 నుంచే కొత్త ట్రాఫిక్ రూల్స్: పాటించకపోతే ఫైన్ల మోతలే!
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 1 నుంచి ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరి పాటించాల్సిందే. లేదంటే ఫైన్ల రూపంలో భారీ మొత్తాలను చెల్లించుకోకతప్పదు. 'కొత్త మోటారు వాహనాల సవరణ చట్టం-2019'లోని 28 నిబంధనలను సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
మొదట రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబంధించిన పాలనాపరమైన నిబంధనలనే అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొంది. మిగతా సెక్షన్లకు సంబంధించి ముసాయిదా నిబంధనలను తయారుచేసి, అభిప్రాయ సేకరణ తర్వాతే అమలు చేస్తామని వెల్లడించింది.
కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై రూ. 500-10,000 వరకు జరిమానా, ఆరు నెలలపాటు జైలు శిక్ష విధించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం కూడా ఉంది. అంతేగాక, ద్విచక్ర వాహనంపై వెళ్లే నాలుగేళ్లలోపు పిల్లలూ హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది.
హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే రూ. 1000 జరిమినా విధిస్తారు. నిర్ణీత వేగం కంటే ఎక్కువ వేగంతో వెళితే.. రూ.1000-2,000 వరుక జరిమానా విధించడం జరుగుతుంది. అత్యవసర పరిస్థితితిలో ప్రయాణించే వాహనాలు అంబులెన్స్, ఫైరింజిన్లకు దారి ఇవ్వకపోతే రూ. 10వేలు జరిమానా విధిస్తారు. అనర్హత వేటుపడిన డ్రైవర్ వాహనం నడిపితే రూ. 10వేలు జరిమానా విధిస్తారు.
నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకునే వాహనాలకు ఒక్కో ప్రయాణికుడిపై రూ. 200చొప్పున జరిమానా విధించడం జరుగుతుంది. అదనపు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం కల్పించిన తర్వాతే ముందుకు వెళ్లేందుకు అనుమతిస్తారు. ఇక సీటు బెల్టు ధరించని డ్రైవర్లకు రూ. వెయ్యి జరిమానా విధించడం జరుగుతుంది.