మీ ఊరికి రైలుబండి వస్తోంది.. తెలుసా?
స్వప్నం సాకారమవుతోంది. కూ.. ఛుక్.. ఛుక్.. ఛుక్ అంటూ పట్టాలపై రైలు పరుగులు తీస్తుంటే ఆ శబ్దాన్ని వినాలని, ఆ దృశ్యం చూడాలని పరితపిస్తున్నవారి కోరిక అతిత్వరలోనే నెరవేరబోతోంది. సిద్ధిపేట ప్రజల దశాబ్దాల కల నిజం కాబోతోంది. మనోహరాబాద్-కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా సిద్ధిపేట వరకు రైల్వే లైన్ సిద్ధం కాబోతోంది. జులై ఆఖరి వారం లేదంటే ఆగస్టు మొదటివారానికి పనులు పూర్తికానున్నాయి.
దుద్దెడ వరకు ట్రాక్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లోపే సిద్ధిపేట వరకు ట్రాక్ పనులు పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ పనులు పూర్తయిన వెంటనే రైలు సేవలు ప్రారంభమవుతాయి. వాస్తవానికి గజ్వేల్ వరకు ట్రాక్ పనులు పూర్తికాగానే ప్యాసింజర్ బండిని నడపాలనుకున్నారు. కొవిడ్ కారణంగా అది వాయిదా పడింది. సికింద్రాబాద్ నుంచి గజ్వేల్ వరకు రైలును ఉపయోగించుకునేవారు తక్కువగానే ఉంటారే కారణంతోపాటు ఆక్యుపెన్సీ తక్కువవుతుందనే భావనతో సిద్ధిపేట నుంచి నడపాలని నిర్ణయించారు.

ఇక్కడి నుంచి అయితే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, డు ఫుష్ ఫుల్ రైలుతో ట్రిప్పులు నడిపితే సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు. సిద్ధిపేట నుంచి కాచిగూడ వరకు ఒక రైలును తిప్పనున్నారు. అలాగే తిరుపతి, బెంగళూరు, ముంబయి నగరాలకు సిద్ధిపేట నుంచి ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే కొన్ని సర్వీసులను సిద్ధిపేట నుంచి ప్రారంభిస్తే జంట నగరాల స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుందనే యోచనలో ఉన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాలంటే మరికొద్దిరోజులు ఆగక తప్పదు.












Click it and Unblock the Notifications