రికార్డుస్థాయిలో తగ్గిన కరోనా: 22 వేలకు: వైరస్ను జయించే దిశగా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తగ్గుతోంది. రికార్డు స్థాయిలో కరోనా వైరస్ రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చినప్పటికీ.. దాని ప్రభావం ఏ మాత్రం కనిపించనట్టే. రోజువారీ కేసుల్లో వేగం కూడా మందగించింది. మరణాలు కూడా ఇదివరకు నమోదైన స్తాయిలో ఉండట్లేదు. వెరసి- కరోనా వైరస్ను జయించే దిశగా భారత్ ఒక్కో అడుగే వేస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితులు ఇక ముందుకూడా కొనసాగితే.. రోజువారీ కేసులు మరింత తగ్గొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దేశంలో కొత్తగా 22,065 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 354 మంది మరణించారు. దీనితో..ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 99,06,165కు చేరుకున్నాయి. ఇందులో 94,22,636 మంది డిశ్చార్జి అయ్యారు. మరణించిన వారి సంఖ్య లక్షా 40 వేలను దాటుకుంది. ఇప్పటిదాకా కరోనా బారిన పడి 1,43,709 మంది మృతి చెందారు.

మరణాల్లో వేగం మందగించడం ఊరట కలిగిస్తోందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 3,39,820గా నమోదైంది. సోమవారం ఒక్కరోజే 34,477 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే కరోనా మృతుల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతూనే ఉంది. అమెరికా, బ్రెజిల్ తరువాత ఆ స్థాయిలో మరణాలు సంభవించింది భారత్లోనే. అమెరికా-3,08,089, బ్రెజిల్-1,81,945 మంది మరణించారు.
భారత్లో 1,43,709 మంది కరోనా బారిన పడి మృతిచెందారు. కరోనా మరణాల్లో మెక్సికో నాలుగో స్థానంలో ఉంది. అక్కడ 1,14,298 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచ దేశాల్లో అత్యధిక మరణాల రేటు నమోదు చేసుకున్న దేశం కూడా అదే. మెక్సికోలోొ 12,55,974 కరోనా కేసులు నమోదు కాగా.. లక్షా 14 వేల మంది మరణించడం అక్కడి తీవ్రతను చాటుతోంది. భారత్లో మరణాల రేటు అతి తక్కువగా ఉంటోంది. 1.5 శాతంగా నమోదైంది. కరోనా నుంచి కోలుకున్న వారి శాతం సగటున 95.1గా రికార్డయింది.












Click it and Unblock the Notifications