ప్రేమించి పెళ్లి చేసుకున్నారు: అంతలోనే ఆత్మహత్య, ఏమైందో...
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో నవదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే, అర్థాంతంగా తనువులు చాలించారు.
ఈ విషాద సంఘటన పశ్చిమ బెంగళూరు నగరంలోని కెంగరీ ప్రాంతంలో గల మైలసాంధ్రలో చోటు చేసుకుంది. దుపట్టాతో ఉరివేసుకుని వారు బలవణ్మరణానికి పాల్పడ్డారు. మాండ్యా జిల్లా కేఎం దొడ్డికి చెందిన ప్రవీణ్ (24) బెంగళూరులోని మైలాసాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రియ (19) లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.
పెద్లల అనుమతితోనే పెళ్లి..
పెద్దల అనుమతితోనే గత నెల 2వ తేదీన ప్రవీణ్, ప్రియ పెళ్లి చేసుకున్నారు. ప్రవీణ్ ఏడేళ్లుగా బెంగళూరు నగరంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అక్కడికి వస్తూ పోతూ ఉన్న సమయంలో ప్రియ అతన్ని ప్రేమించింది. ఆ తర్వాత వారిద్దరూ పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి తర్వాత అద్దె ఇంట్లో దిగారు..
వివాహం చేసుకున్న తర్వాత నవ దంపతులు అద్దె ఇంట్లో దిగారు. ఏమైందో తెలియదు గానీ నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారు సూసైడ్ నోట్ రాసిన దాఖలాలు కనిపించలేదు. దాంతో వారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనేది మిస్టరీగానే ఉండిపోయింది.
ప్రియ తల్లి ఆలా...
మైలాసాంధ్రలో ఉన్న కూతురికి, అల్లుడికి ప్రియ తల్లి ఫోన్ చేసింది. అయితే, వారు ఎత్తలేదు. దీంతో ఆమె వెంటనే మైలాసాంధ్రకు వచ్చేసింది. దంపతులు ఇంటి ముందు చాలా మంది గుమికూడి ఉన్నారు. విగతజీవులైన ఇద్దరిని చూసి ప్రియ తల్లి రోదించసాగింది.
పోలీసులు వచ్చి ఇలా...
సమచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి వారి మృతదేహాలను పోస్టుమార్టం చేయించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొత్త ఇంటికి నవ దంపతులు 15 రోజుల కిందనే మారినట్లు చెబుున్నారు.