శశికళ పక్క గదిలో ఆరు హత్యలు చేసిన సైనైడ్ మల్లిక
ఆరుగురిని హత్య చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్న సైనైడ్ మల్లిక గదికి పక్క గదినే శశికళకు కేటాయించినట్లు తెలుస్తోంది. మల్లిక శశికళతో మాట్లాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్లు వార్తలు...
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేజారడంతో పాటు జైలు పాలైన అన్నాడియంకె ప్రధాన కార్యదర్శి శశికళ సెల్ పక్క గదిలోనే ఆరు హత్యలు చేసిన మహిళ ఉంటోంది. ఆమె పలుసార్లు శశికళతో మాట్లాడడానికి ప్రయత్నించినట్లు చెబుతున్నారు. అయితే, శశికళ మాత్రం ఆమెతో మాట్లాడలేదని బెంగళూర్ మిర్రర్ రాసింది.
ఆక్రమాస్తుల కేసులో శశికళ ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆమె అక్కడ పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండడాన్ని టీవీలో వీక్షించినట్లు కథనాలు వచ్చాయి. ఆమె సమయంలో పక్క గదిలో ఉంటున్న సైనేడ్ మల్లిక అనే మహిళా హంతకురాలు శశికళతో మాట్లాడడానికి ప్రయత్నించినట్లు బెంగళూర్ మిర్రర్ రాసింది.
మల్లికపై ఆరు హత్య కేసులు ఉన్నాయి. ఆలయాల వద్దకు వచ్చినవారిని బంగారం కోసం ఆరుగురిపై విషప్రయోగానికి దిగిన కేసులో ఆమెకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అయితే, ఇటీవల అది జీవిత కారాగార శిక్షగా మారింది. ఆమె తొలిరోజు శశికళతో మాట్లాడడానికి ప్రయత్నించినట్లు, అయితే శశికళ స్పందించనట్లు బెంగళూర్ మిర్రర్ రాసింది.
గురువారం మాత్రం మల్లికను చూసి శశికళ నవ్వినట్లు బెంగళూరు మిర్రర్ రాసింది. తొలి రోజు రాత్రి శశికళ సెల్లో నిద్రపోవడానికి తీవ్రంగా ప్రయత్నించినట్లు కూడా బెంగళూరు మిర్రర్ రాసింది. కొద్దిగానైనా తినాలని ఆమె మరదలు ఇళవరసి బతిమిలాడినట్లు చెబుతున్నారు.