తమిళనాడు ప్రభుత్వంలో గవర్నర్ జోక్యం, రోజూ వస్తా, అసెంబ్లీలో ఆఫీస్, ఏం జరుగుతోంది ?
తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వంపై పెత్తనం చెయ్యడానికి ఆ రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ సిద్దం అయ్యారు.
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వంపై పెత్తనం చెయ్యడానికి ఆ రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ సిద్దం అయ్యారు. కోయంబత్తూరులో రెండు రోజుల పాటు పర్యటించిన గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ తాను తమిళనాడు రాష్ట్రం అంతటా పర్యటిస్తానని, అధికారులతో భేటీ అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
చెన్నైలోని సచివాలయంలో తనకు ఓ కార్యాలయం ఏర్పాటు చెయ్యాలని, ప్రతి రోజూ తాను కార్యాలయానికి వచ్చి వెలుతానని ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వానికి గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ సమాచారం ఇచ్చారు. సచివాలయంలో గవర్నర్ కు ఓ కార్యాలయం, విశ్రాంతి గది కేటాయించడానికి ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తమిళనాడులో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, పలు శాఖల మంత్రులు ఉన్నారని, రాజ్యంగా పరిరక్షణ బాధ్యతలు నిర్వహించాల్సిన గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకోవడం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
తమిళనాడును రెండు తలల పాముగా మార్చివేసి అధికారుల పరిపాలనను స్తంభింపజేయడానికి సిద్దం అయ్యారని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ మండిపడ్డారు. పుదుచ్చేరీలో గవర్నర్ కిరణ్ బేడీ జోక్యంలా తమిళనాడులో ఆ రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకుంటారని, పుదుచ్చేరి వ్యాది తమిళనాడుకు సోకిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణస్వామి విమర్శించారు. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, సీపీఎం సీనియర్ నాయకుడు జి. రామక్రిష్ణన్, వీసీకే అధ్యక్షుడు తిరుమావళన్, రాందాస్ తదితరులు గవర్నర్ తీరుపై మండిపడుతున్నారు.