టెర్రర్ ఫండింగ్ కేసులో జమ్మూ కాశ్మీర్లో ఏడుచోట్ల ఎన్ఐఏ దాడులు; టార్గెట్ ఆ ట్రస్టుపైనే!!
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉగ్రవాద మూలాలున్న సంస్థలపై ఉక్కు పాదం మోపుతుంది. దూకుడుగా జాతీయ దర్యాప్తు సంస్థ టెర్రర్ ఫండింగ్ సంస్థలపై దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టెర్రరిస్టులకు సంబంధించి మూలాలు ఉన్న అనేక సంస్థలపై దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని పలు ప్రాంతాలలో సోదాలు కొనసాగిస్తోంది. ఈ సారి అల్-హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ను టార్గెట్ చేసింది.
అల్-హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పై ఉగ్రవాద ఫండింగ్ అనుమానం .. ఎన్ఐఏ దాడులు
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసు దర్యాప్తుకు సంబంధించి ఈ సోదాలు కొనసాగుతున్నట్లు గా సమాచారం. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ లో ఉన్న అల్-హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యొక్క అనుమానాస్పదమైన కార్యకలాపాలకు సంబంధించిన కేసులో ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు జరుపుతోంది. ఈ కేసులో పూంచ్, జమ్మూ, పుల్వామా, శ్రీనగర్, బుద్గాం, షోపియాన్, రాజౌరీ జిల్లాలోని పలు ప్రాంతాలలో ఎన్ఐఏ సోదాలు చేస్తున్నట్టు సమాచారం.
స్థానిక పోలీసుల సహకారంతో ఏకకాలంలో ఏడు చోట్ల సోదాలు
నిర్దిష్టమైన సమాచారంతోనే ఈ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఏకకాలంలో దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులు అనేక బృందాలుగా ఏర్పడి ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. జమ్మూకాశ్మీర్లోని 7 ప్రాంతాలలో జరుగుతున్న ఈ సోదాల్లో జమ్మూకాశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ పోలీసుల సమన్వయంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.
అల్-హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పై సుమోటోగా కేసు .. కొనసాగుతున్న దాడులు
ఇప్పటికే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపిన ఎన్ఐఏ అధికారులు, ఇప్పుడు అల్-హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిధుల తీరు, కార్యకలాపాలపై గతంలో నమోదు చేసిన సుమోటో కేసు ఆధారంగా అల్-హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రాంతాలలో సోదాలు కొనసాగిస్తోంది. 2019లో చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద జమాతే ఇస్లామీ సంఘానికి అల్-హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఫ్రంటల్ ఎంటిటీ గా పనిచేస్తున్నట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే అల్-హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రాంగణాల పై దాడులు నిర్వహిస్తోంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ.