చేయి దాటి పోయినట్టే: 10 జిల్లాలకు విస్తరించిన నైట్ కర్ఫ్యూ: పార్కులకు తాళాలు
చండీగఢ్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. రెక్కలు విరుచుకుంటోంది. నిన్న, మొన్నటి దాకా మహారాష్ట్రకే పరిమితమైన కరోనా కేసుల పెరుగుదల.. క్రమంగా పొరుగు రాష్ట్రాలకు వ్యాపించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరించింది. పరిస్థితి అదుపు తప్పినట్టే కనిపిస్తోంది. వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఆయా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను విధించాయి. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తిరుగాడటంపై ఆంక్షలు పెట్టాయి.
కరోనా విలయంలో అద్భుతం -కొవిడ్ యాంటీ బాడీస్తో తొలి శిశువు జననం -తల్లి వ్యాక్సిన్ తీసుకోగా
గుజరాత్లోని నాలుగు ప్రధాన నగరాల్లో నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్కోట్లల్లో రాత్రి 10 నుంచి తెల్లవారు జామున 6 గంటల వరకు కర్ఫ్యూను విధించారు. అహ్మదాబాద్లోని అన్ని పార్కులను మూసివేశారు. సందర్శకులకు అనుమతి ఇవ్వట్లేదు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ పార్కుల్లో సందర్శకులకు అనుమతి ఇవ్వబోమంటూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన నోటీసులను పార్కు గేట్ల వద్ద అతికించారు.
పంజాబ్లో ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 10 జిల్లాల్లో నైట్ కర్ఫ్యూను విధించినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి కేప్టెన్ అమరీందర్ సింగ్ వెల్లడించారు. ఇదివరకు రాత్రి 11 నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు కొనసాగిన కర్ఫ్యూ సమయాన్ని పొడిగించామని అన్నారు. రాత్రి 9 గంటల నుంచే కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని చెప్పారు. లూధియానా, జలంధర్, పటియాలా, అమృత్సర్, గురుదాస్పూర్, హోషియార్పూర్, కపుర్తలా, రోపర్ జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ విధించామని, ఆయా జిల్లాల్లో కొద్ది రోజులుగా రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.