నిర్భయ కేసు: రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన మరో దోషి అక్షయ్ ఠాకూర్
న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషుల్లో ఒకడైన అక్షయ్ ఠాకూర్ శనివారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు. ఈ మేరకు వివరాలను జైలు అధికారులు, అక్షయ్ ఠాకూర్ తరపు న్యాయవాది వెల్లడించారు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు అక్షయ్ ఠాకూర్ శనివారం క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడని డైరెక్టర్ జనరల్(జైలు) సందీప్ గోయెల్ తెలిపారు. కాగా, అక్షయ్ కుమార్ తోపాటు మిగిలిన ముగ్గురికి కూడా శనివారమే ఉరితీయాల్సి ఉండగా.. ఢిల్లీ పాటియాలా కోర్టు ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది. దీంతో శిక్ష అమలు వాయిదా పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఉరిశిక్ష అమలు నిలిపివేయాలని స్పష్టం చేసింది.
కాగా, నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై స్టే విధించిన సందర్భంగా ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు స్పందిస్తూ.. ఒకే కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషుల పట్ల వివక్ష చూపకూడదనే ఉద్దేశంతోనే ఉరిశిక్షను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చేసింది. ఈ కారణంగానే నిర్భయ కేసులో దోషులైన ముకేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్, పవన్ గుప్తాలకు ఉరిశిక్షపై స్టే విధించినట్లు తెలిపింది. ఈ మేరకు 10 పేజీలతో కూడిన ఆర్డర్ జారీ చేసింది.
'నిర్భయ కేసులో శిక్ష నుంచి తప్పించుకునేందుకు ముకేష్ సింగ్(క్యూరేటివ్ పిటిషన్, క్షమాభిక్ష లాంటి మిగితా అవకాశాలన్నీ తిరస్కరణకు గురయ్యాయి)కు చట్టపరంగా అన్ని దారులు మూసుకుపోయాయి. అయితే, మిగితా ముగ్గురికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. మనదేశంలోని న్యాయస్థానాలు దోషుల పట్ల ఎలాంటి వివక్ష కలిగి ఉండవు. మరణశిక్ష కూడా ఇందుకు మినహాయింపు కాదు. కాబట్టి ముకేష్ ఒక్కడినే ఉరితీయడం సాధ్యం కాదు' అని నిర్భయ దోషలు మరణశిక్షపై స్టే ఇచ్చిన సందర్భంగా జడ్జీ ధర్మేంద్ర రానా పేర్కొన్నారు.