చంద్రస్వామితో లింకులు.. మగవాళ్లకూ మంత్రిత్వ శాఖ.. నిర్భయ దోషుల లాయర్ మామూలోడుకాదు..
అజయ్ ప్రకాశ్ సింగ్ అలియాస్ ఏపీ సింగ్.. దాదాపు ఏడేళ్లుగా దేశంలో మారుమోగుతోన్న పేరిది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషుల తరుఫున వాదించిన ఆయన.. చివరి నిమిషం దాకా ఉరిశిక్ష రద్దుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. దేశంలో అత్యున్నత కోర్టు నుంచి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. చివరికి శుక్రవారం ఉదయం తీహార్ జైలులో ఆ నలుగురినీ ఉరితీయడంతో ఆయన ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
శిక్షల అమలు తర్వాత చనిపోయిన నిర్భయపై, బతికున్న ఆమె తల్లి ఆశాదేవిపై అడ్వొకేట్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎంతటి దారుణానికి తెగబడినా.. దోషులకు తప్పనిసరిగా న్యాయసహాయం అందాల్సిందేనన్న వాదన పక్కనపెడితే.. నిర్భయ లాంటి కూతురు తనకుంటే పెట్రోల్ పోసి తగలబెట్టేవాణ్నని, నిర్భయ లాంటిదే మరో కేసు చేతికొచ్చినా ఇదే రకమైన ప్రయత్నాలు చేస్తానని గతంలో బాహాటంగా ప్రకటించారాయన. తనను మహిళా ద్వేషి అని విమర్శించేకంటే.. పురుష పక్షపాతిగా చూడాలని కోరే ఏపీ సింగ్ ప్రస్థానం ఎలా మొదలైందంటే..
చంద్రస్వామి కొనిచ్చిన డ్రెస్తో..
లక్నోలోని రాంమనోహర్ లోహియా నేషనల్ లా వర్సిటీలో డిగ్రీ పూర్తిచేసిన ఆయన, కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి క్రిమినాలజీలో డాక్టరేట్ కూడా పొందారు. 1997లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ లో సభ్యత్వం పొందిన తొలినాళ్లలో ఆయనకు చంద్రస్వామితో పరిచయం ఏర్పడింది. అప్పటికే వివాదాస్పద తాంత్రికుడిగా, అప్పటి ప్రధాని పీవీకి ఆథ్యాత్మిక సలహాదారుగా, ఇటు రాజకీయ, వ్యాపార వర్గాలు, అటు దావూద్ ఇబ్రహీం లాంటి మాఫియా లీడర్లతోనూ దగ్గరి సంబందాలున్న వ్యక్తిగా చంద్రస్వామి పేరుగాంచారు. ఆ గురువుగారు కొనిచ్చిన డ్రెస్ ధరించే ఏపీ సింగ్ లాయర్ గా తొలి కేసు వాదించారు. వివిధ కేసుల్లో చంద్రస్వామి దోషిగా నిర్దారణ అయి, 2017లో చనిపోయేదాకా ఆయనతో సింగ్ అనుబంధం కొనసాగింది.
మహిళలంటే మంట..
తాను రాజ్పుత్ నని గర్వంగా చెప్పుకునే ఏపీ సింగ్.. మనిషికి పరువు కంటే మించింది ఏదీ లేదని అంటారు. సమాజంలో మహిళల పాత్రపైనా ఆయనకు తనవైన అభిప్రాయాలున్నాయి. దేశంలో ఆత్మహత్యకు పాల్పడేవాళ్లలో ఎక్కువ మంది మగాళ్లేనని, అందులోనూ మహిళల కారణంగా చనిపోతున్నవాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉందని ఆయన వాదిస్తారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మాదిరిగా మగవాళ్ల కోసం కూడా ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను చాలా కాలంగా వినిపిస్తున్నారు.
చిన్మయానందకు బెయిల్ వెనుకా..
బీజేపీకి చెందిన కీలక నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానందకు బెయిల్ ఇప్పించింది కూడా ఏపీ సింగే కావడం గమనార్హం. తన ఆశ్రమానికి చెందిన లా కాలేజీలో చదివే విద్యార్థినిపై చిన్మయానంద అత్యాచారానికి పాల్పడినట్లు కోర్టులో నిర్ధారణ అయింది. అయితే లైంగిక బంధం ద్వారా ఇద్దరూ(చిన్మయానంద, విద్యార్థిని) పరస్పరం ప్రయోజనాలు పొందారని, ఇందులో ఒకరిని మాత్రమే తప్పుపట్టాల్సిన అవసరం లేదన్న సింగ్ వాదనతో కోర్టు ఏకీభవించడం, ఆ వెంటనే బెయిల్ పై విడుదలైన చిన్మయానందకు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలకడం తెలిసిందే.
తల్లి చెప్పినందుకే నిర్భయ కేసు..
నిర్భయ ఉదంతంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమైన నేపథ్యంలో నిందితుల తరఫున వాదించేందుకు లాయర్లెవరూ ముందుకు రాలేదు. తాము కేసును టేకప్ చేయబోమని పలు బార్ అసోసియేషన్లు బాహాటంగా ప్రకటించాయి. నిర్భయ దోషుల్లో ఒకరైన అక్షయ్ ఠాకూర్ సింగ్ భార్య పునీతా దేవి తొలుత ఏపీ సింగ్ ను కలవగా.. కేసు తీసుకోబోనని వెనక్కి పంపించారు. అయితే, సింగ్ దగ్గర జూనియర్ గా పనిచేస్తోన్న లాయర్ ద్వారా.. ‘మదర్ సెంటిమెంట్' గురించి తెల్సుకున్న ఓ తీహార్ జైలు అధికారి.. ఆ సమాచారాన్ని అక్షయ్ కుటుంబానికి చేరవేశాడు. దీంతో అక్షయ్ భార్య పునీతా.. నేరుగా ఏపీ సింగ్ తల్లి విమలా సింగ్ ను కలిసి వేడుకున్నారు. దోషుల కుటుంబాల పరిస్థితి విని చలించిపోయిన విమలా సింగ్.. కేసు టేకప్ చేయాలంటూ కొడుకు ఏపీ సింగ్ కు సూచించింది. కాదనలేని స్థితిలో ఆయన నిర్భయ కేసులోకి ఎంటరయ్యారు.
Recommended Video
గాంధీ ఆదర్శాలకు విరుద్ధం..
మహాత్ముడి సిద్ధాంతాలను క్షుణ్నంగా చదివానని చెప్పుకునే ఏపీ సింగ్.. ఒక వ్యక్తిని చట్టబద్ధంగా చంపడం గాంధీ ఫిలాసఫీకి విరుద్ధమని, శిక్షలు అనేవి దోషులు పరివర్తన చెందడానికే తప్ప చంపడానికి కాదని అంటారాయన. ఎంతో మందిని చంపేసిన ఫూలన్ దేవి లాంటివాళ్లు, ఇంకా ఎంతో మంది నేరస్తులు జైళ్లలో పరివర్తన చెందారని, నిర్బయ కేసులో దోషులుగా తేలిన ఆ నలుగురికి కూడా పరివర్తనకు అవకాశం కల్పిస్తూ.. మరణ శిక్షలు రద్దు చేయాలని ఆయన వాదించారు. ఈ ఏడేళ్ల కాలంలో చాలా మంది జడ్జిలు ఏపీ సింగ్ వాదనలతో విభేదిస్తూ ఆయనను తప్పుపట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. న్యాయవ్యవస్థతో ఆటాడుకున్నాడని సోషల్ మీడియాలో విమర్శలు కూడా వెల్లువెత్తాయి.