సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిర్భయ తల్లిదండ్రులు
న్యూఢిల్లీ: నిర్భయ తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిర్భయ దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలన్న పిటిషన్పై విచారణను ఢిల్లీ పటియాల హౌస్ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో దోషిగా ఉన్న అక్షయ్ రివ్యూ పిటిషన్ డిసెంబర్ 17న సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు పేర్కొంది.
తదుపరి విచారణ డిసెంబర్ 18న చేపడతామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో నిర్భయ తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్షయ్ రివ్యూ పిటిషన్లో ప్రతివాదిగా చేర్చాలని అనుమతి కోరారు. శిక్ష అమలు ఆలస్యంపై పిటిషన్ వేస్తామని నిర్భయ తరపు న్యాయవాది తెలిపారు.
కాగా, ప్రతివాదిగా చేర్చాలని కోరుతూ పిటిషన్ వేసేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే అనుమతించారు. ఈ సందర్భంగా నిర్భయ తల్లి మాట్లాడారు. ఏడేళ్ల నుంచి దోషులకు శిక్ష ఎప్పుడు పడుతుందా? అని ఎదురుచూస్తునే ఉన్నామని అన్నారు.
మరో వారం రోజులు కూడా వేచి చూడగలమని ఆమె అన్నారు. డిసెంబర్ 18న నిర్భయ దోషులపై డెత్ వారెంట్ విడుదలవుతుందని నిర్భయ తల్లి అన్నారు. కాగా, డిసెంబర్ 17న ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది.
2012లో నిర్భయను ఆరుగురు నిందితులు దారుణంగా అత్యాచారం, చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. నిందితులకు వెంటనే ఉరిశిక్షవేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. ఆరుగురు నిందితులలో ఒకరు మైనర్ కావడంతో జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. మరో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు దోషులకు డిసెంబర్ 18న శిక్ష పడనుంది.