"రష్యా నుంచి చమురు కొంటూనే ఉంటాం"
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ లు విధించిన విషయం తెలిసిందే. భారత్ వస్తువులపై 50 శాతం టారిఫ్ లు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. ఆగస్టు 27 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో అమెరికా- భారత్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
" రష్యా చమురు అయినా లేక మరోటి అయినా మాకు ఏం కావాలో ఏం అవసరం ఉందో వాటిపై వాణిజ్యం కొనసాగుతుంది. అవి రేట్లు అయినా, లాజిస్టిక్స్ అయినా. మాకు ఏది అయితే బెస్ట్ గా సూట్ అవుతుందో అదే చేస్తాం. రష్యాతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి. వాణిజ్యంలో రష్యా భారత్ ఇరు దేశాలు సహకరించుకుంటున్నాయి. అందువల్ల రష్యా నుంచి కచ్చితంగా ముడి చమురు కొనుగోలు చేస్తాం. అందులో డౌట్ లేదు. అది కొనసాగుతూనే ఉంటుంది" అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే భారత్ దిగుమతి చేసుకుంటున్న వస్తువుల్లో ముడి చమురు అధిక భాగంలో ఉందని తెలిపారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక అమెరికా విధించిన టారిఫ్ లకు భారత్ నుంచి ఉత్పత్తులను ఎగుమతి చేసే రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్న క్రమంలో నిర్మలా సీతారామన్ స్పందించారు. ఎగుమతి దారులను ఆదుకునేందుకు త్వరలోనే ఓ ప్రత్యేక ప్యాకేజీని తీసుకొస్తామని తెలిపారు. ట్రంప్ సుంకాలతో దెబ్బతిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు ఈ ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత 25 శాతం సుంకాలు.. ఆ తర్వాత మరో 25 శాతం సుంకాలు విధించారు. అలా ఆగస్టు 27 నుంచి భారత్ పై 50 శాతం టారిఫ్ లు విధించారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థను టార్గెట్ చేసిన ట్రంప్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పై పడ్డారు. భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం కారణంగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం జరుపుతోందని ట్రంప్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications