No Jobs: దేశంలో యువతకు పనిలేదు.. 8 కోట్ల నిరుద్యోగ భారతం
దేశంలో కోట్లాది మంది యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చదువు పూర్తిచేసి, ఉద్యోగం రాక, ఎలాంటి నైపుణ్య శిక్షణకు నోచుకోక దాదాపు 8.7 కోట్ల మంది యువత ఖాళీగా మిగిలిపోయినట్లు నీతి ఆయోగ్ తన నివేదికలో వెల్లడించింది. 15 నుంచి 29 ఏళ్ల వయస్సున్న వారిలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. వికసిత్ భారత్ 2047 సాధనలో భాగంగా రూపొందించిన నివేదిక ప్రకారం.. వీరంతా చదువు కోసం ఇప్పటికే రూ.లక్షలు ఖర్చు చేసి, తిరిగి ఎలాంటి ఆదాయం లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
సాధారణ డిగ్రీలు పూర్తి చేసినప్పటికీ, మార్కెట్ అవసరాలకు తగ్గ నైపుణ్యాలు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. పేద కుటుంబాల నుంచి వచ్చిన యువత డిగ్రీ పూర్తయ్యాక అదనంగా డబ్బులు చెల్లించి స్కిల్ కోర్సులు నేర్చుకోలేని స్థితిలో ఉన్నారు. దీంతో కొందరు కుటుంబ పోషణ కోసం చదువుకు తగని, అతి తక్కువ జీతం వచ్చే చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరుతుండగా.. మరికొందరు అసలు ఏ పనీ దొరక్క నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. విద్యార్హతలకు తగ్గ ఉద్యోగాలు లభిస్తున్నది కేవలం 8.25 శాతం మందికే కావడం గమనార్హం.

ఉపాధి వైపు అడుగులు: ప్రభుత్వ ప్రోత్సాహకాలు తప్పనిసరి
ఈ సమస్య పరిష్కారానికి సబ్సిడీతో కూడిన నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు అత్యంత అవసరమని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. స్థానిక పరిశ్రమలు, వర్ధమాన రంగాల అవసరాలకు అనుగుణంగా కోర్సులను అందుబాటులోకి తేవాలని సూచించింది. చదువుకుంటూనే సంపాదించేలా లేదా స్వయం ఉపాధి పొందేలా యువతను ప్రోత్సహించాలని స్పష్టం చేసింది. నాణ్యమైన శిక్షణ ద్వారా మాత్రమే యువతను ఉత్పాదక శక్తులుగా మార్చవచ్చని పేర్కొంది.
2047 లక్ష్యం: స్కిల్లింగ్ తోనే పురోగతి
2047 నాటికి భారత్ను వికసిత దేశంగా మార్చాలనే లక్ష్యం నెరవేరాలంటే నిరంతరం నేర్చుకోవడం, సంపాదించడం అవసరమని నివేదిక ఉద్ఘాటించింది. 2014-15 నుంచి ఇప్పటివరకు దాదాపు 7.67 కోట్ల మందికి పైగా శిక్షణ అందించినప్పటికీ, ఈ 8.7 కోట్ల మంది యువతను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలుగా నిలుస్తోంది.














Click it and Unblock the Notifications