నా తండ్రిని అవమానించారు: నితీష్ కుమార్పై చిరాగ్ పాశ్వాన్ తీవ్ర విమర్శలు
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచార జోరును పెంచాయి. ఇటు ఎన్డీఏ కూటమి, అటు మహాగఠబంధన్ రెండు కూడా మిత్రపక్షాల నుంచి తలనొప్పులు ఎదుర్కొంటున్నాయి. ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ఎల్జేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేసింది.
బీహార్ : ఆరుగురు సీఎం అభ్యర్థులు... ముగ్గురు సీనియర్లను ఢీకొడుతున్న ముగ్గురు యంగ్&డైనమిక్ నేతలు..
ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ మరణంతో ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఇప్పుడు పార్టీని నడిపిస్తున్నారు. ఆయన మొదట్నుంచి కూడా బీహార్ సీఎం నితీష్ కుమార్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్జేపీ ఒంటిరగా పోటీ చేయాలనేది తన తండ్రి కోరిక అని చిరాగ్ పాశ్వాన్ తెలిపారు.
ఈసారి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని మా నాన్న భావించారు. అలా అయితేనే పార్టీకి ఆదరణ, మనుగడ ఉంటుందన్నారు. ఎన్డీఏ నుంచి విడిపోయినా.. బీజేపీతో పొత్తుకు కట్టుబడి ఉన్నాం. నితీష్ కుమార్ ప్రభుత్వంపై పోరాడుతాం. ఒంటరిగా బరిలో దిగాలను నాన్న నన్ను ప్రేరేపించారు. ఇది నా తండ్రి కల. 2005లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని గురించి నిత్యానంద్ రాయ్, షహనావాజ్ హుస్సేన్ లాంటి బీజేపీ నేతలకు కూడా ఈ విషయం తెలుసని చిరాగ్ పాశ్వాన్ వెల్లడించారు.
సీఎం నితీష్ కుమార్ మరో ఐదేళ్లు కొనసాగితే మరో 10-15 ఏళ్లు చింతించాల్సి వస్తుంది. మరో ఐదేళ్లు రాష్ట్ర ప్రజలు బాధపడతారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగడం ప్రజల పాలిట పెను విపత్తు అవుతుందని నా తండ్రి భావించారు. అందుకే ఒంటరిగా పోటీ చేయాలని నన్ను ప్రేరేపించారని చిరాగ్ పాశ్వాన్ తెలిపారు.
గత లోక్సభ ఎన్నికల్లో నితీష్ కుమార్ తమ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని, ఇది తన తండ్రిని అవమానించినట్లుగా భావిస్తున్నట్లు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. తన తండ్రి లేకపోవడం తనకు, పార్టీకి తీరని లోటన్న ఆయన... రాంవిలాస్ పాశ్వాన్ ఆశయాలతో ముందుకు సాగుతానని చెప్పారు. అక్టోబర్ 28 నుంచి అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 10న ఫలితాలు వెలువడనున్నాయి.