ఉగ్రవాదంపై పాక్కు సర్టిఫికేట్: భారత్ తీవ్ర స్పందన, నో.. తగ్గిన అమెరికా
ఢిల్లీ/వాషింగ్టన్: ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ అణచివేసిందన్న అమెరికా ధ్రువీకరణ పైన భారత్ ఘాటుగా స్పందించింది. దీంతో అమెరికా దాని పైన వివరణ ఇచ్చింది. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్కు తాము ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదని యూఎస్ తెలిపింది.
లష్కరే తోయిబా, అల్ ఖైదా, జైషే మహ్మద్, హక్కానీ నెట్ వర్క్ సహా పలు ఉగ్రవాద సంస్థల స్థావరాలను ధ్వంసం చేయడంలో కానీ వారికి తోడ్పాటును నిలిపివేయడంలో కానీ గట్టి నిబద్ధతను పాక్ ప్రదర్శించడం లేదని భారత్ ఆరోపించింది.
పాక్ భూభాగం నుండి పని చేస్తున్న ఉగ్రవాద ముఠాలను ఆ దేశ ప్రభుత్వం నిరోధించిందని, అమెరికా ధ్రువీకరించింది. కెర్రీ - లుగార్ బిల్లు కింద అమెరికా సాయం అందాలంటే ఈ ధ్రువీకరణ పాక్కు తప్పనిసరి. సాయం అందచేసేందుకు అధ్యక్షులు బరాక్ ఒబామాకు అమెరికా కాంగ్రెస్ అనుమతి ఇచ్చింది.
ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ సోమవారం తీవ్రంగా స్పందించారు. పంజాబీ/ఉర్దూ మాట్లాడే ముఠాలు అప్ఘనిస్తాన్లో ఉగ్రవాదులతో కలిసి పని చేస్తున్నట్లు ఆధారాలు లభ్యమవుతున్నాయని, ఈ ఉగ్రవాద సంస్థలు ఆప్ఘన్లోని భారత రాయబార కార్యాలయం, కాన్సులేట్లలో పని చేస్తున్న సిబ్బంది సహా ఆ దేశంలోని అంతర్జాతీయ సమాజ సభ్యులకు ముప్పుగా పరిణమించాయన్నారు.
ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్కు అమెరికా కితాబు ఇవ్వడంతో భారత్ భగ్గుమంది. ఈ నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్కు ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదని వివరణ ఇచ్చింది. అలాగే పాకిస్తాన్కు 532 మిలియన్ డాలర్లను ఇఛ్చేందుకు ఎలాంటి క్లియరెన్స్ కాలేదని తెలిపింది.