గుడ్న్యూస్: 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మరణాల్లేవ్, వారం రోజులు ఏడు రాష్ట్రాల్లో!
న్యూఢిల్లీ: దేశంలో క్రమంగా కరోనా కొత్త కేసులు, మరణాల సంఖ్య తగ్గుతోంది. అదే సమయంలో కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటుండటం శుభ సూచకం. కాగా, గడిచిన 24 గంటల్లో 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా సంభవించకపోవడం గమనార్హం. ఈ మేరకు వివరాలను ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు.
గత 24 గంటల్లో 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదన్నారు. ఇప్పటికే గత వారం రోజుల నుంచి ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదని రాజేశ్ భూషణ్ తెలిపారు.
నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మాట్లాడుతూ.. దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గడమే గాక, గడిచిన ఒక రోజు వ్యవధిలో ఢిల్లీలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదని తెలిపారు. రోజువారీ మరణాలు సగటున 55 శాతం తగ్గాయన్నారు. అయితే, మన జనాభాలో 70 శాతం ప్రజలకు హాని ఉందని సెరో సర్వే చెబుతోందని, ఈ క్రమంలో కరోనా జాగ్రత్త చర్యలు ఇంకా కొంత కాలం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.
గడిచిన 24 గంటల్లో దాదాపు 9వేల(9110) కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1,08,47,304కు చేరింది. తాజాగా 78 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,55,158కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1.43లక్షల(1,43,625)కు తగ్గాయి. గత 24 గంటల్లో 14,016 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మహమ్మారిబారినుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 1,05,48,521కి చేరింది. ఫిబ్రవరి 8న 687138 నమూనాలను పరీక్షించగా.. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 20,25,87,752కి చేరింది.