రూ.500 నోట్లు రద్దు చేయలేదు, శని, ఆదివారాలు బ్యాంకులు ఓపెన్: ఆర్బీఐ
న్యూఢిల్లీ: ప్రస్తుతం రూ.500 నోట్లను ప్రస్తుతం మార్పిడి చేస్తున్నట్లు ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) బుధవారం నాడు ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దుతో అవినీతిపరులకే నష్టమని చెప్పారు. ప్రస్తుత పరిస్థితితో నాలుగైదు రోజులు ఇబ్బందులు తప్పవని చెప్పారు.
ఈ శనివారం, ఆదివారం నాడు బ్యాంకులు పని చేస్తాయని ఆర్బీఐ తెలిపింది. ఈ రోజు, రేపు బ్యాంకులు, ఏటీఎంలు బంద్ అయిన విషయం తెలిసిందే. వీకెండ్లో బ్యాంకులు పని చేస్తాయని ఆర్బీఐ ప్రకటించడం వినియోగదారులకు ఊరట కలిగించే విషయం.
రూ.2000 నోట్లలో చిప్పై జైట్లీ
రూ.2000 నోట్లలో చిప్ పెడతారన్న మాట ఎలా వచ్చిందో తనకు అర్థం కావడం లేదని, తనకు తెలిసినంత వరకు అలాంటిదేమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
బినామీ లావాదేవీలను అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశ విశ్వసనీయతను పెంచుతుందన్నారు. పెద్ద నోట్ల మార్పిడికి అదనపు కౌంటర్లు, సమయంపై బ్యాంకర్లు ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అవసరాన్ని బట్టి, పరిస్థితులకు అనుగుణంగా అదనపు సమయంపై నిర్ణయం తీసుకుంటారన్నారు.
నగదు ఉంటే బంగారం కొని దాచిపెడతారన్నది వాస్తవం కాదన్నారు. జీఎస్టీ అమలు తర్వాత ఎక్కడ ఎవరు ఏ నగదు లావాదేవీలు జరిపినా బయటపడతారని, నగదు బదిలీ ప్రక్రియలో ప్రజలు ఖర్చు చేసే పద్ధతుల్లో మార్పు వస్తుందన్నారు.
నిజాయతీగా ఖర్చుపెట్టేవాళ్లు సంతృప్తిగా జీవిస్తారని, న్యాయబద్ధ సంపాదనను బ్యాంకుల్లో వేస్తే ఇబ్బంది ఉండదన్నారు. రేపు రూ.10లక్షలు జమ చేసి రెండు రోజుల తర్వాత చెక్కు రాసి ఇవ్వవచ్చునని చెప్పారు. నిజాయితీగా సొమ్ము దాచుకున్న వారికి ఇబ్బంది ఉండదన్నారు.
ఈ నిర్ణయంతో ఎన్నికల్లో ఖర్చు తగ్గితే దేశానికి శుభసూచకం అన్నారు. చట్టబద్ధ లావాదేవీలతో ఆర్థిక వ్యవస్థ విస్తృతమవుతుందన్నారు. ఆర్థిక వ్యవస్థ విస్తృతమైతే వృద్ధి రేటు పెరుగుతుందన్నారు. ఇది సంచలన నిర్ణయం అని చెప్పారు. బ్లాక్ మనీని నిరోధించేందుకే ఈ నిర్ణయం అన్నారు.
క్యాష్ ఆన్ లైన్ డెలివరీలు లేవు
పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేసిన కారణంగా ప్రముఖ ఆన్లైన్ వ్యాపార సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ క్యాష్ ఆన్ డెలివరీల పైన వస్తువులను విక్రయించే సదుపాయాన్ని నిలిపివేశాయి. దీనికి సంబంధించి క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం తాత్కాలికంగా అందుబాటులో లేదు.. అనే సందేశాన్ని పొందుపరిచారు.
స్నాప్డీల్, ఫ్లిప్ కార్ట్ సైట్లలో రూ.2000 పైన వస్తువులకు మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం ఉండదని తెలుస్తోంది. ఉబర్ క్యాబ్స్ వంటివి నగదును స్వీకరిస్తున్నాయి కానీ రూ.500, రూ.1000 నోట్లు స్వీకరించబడవనే సందేశాలను వినియోగదారులకు పంపుతున్నాయి. ఓలా మాత్రం ఇటువంటి సందేశాలను పంపించలేదు.