థర్డ్ వేవ్లో పిల్లలపై కరోనా ప్రభావం అంతగా ఉండకపోవచ్చు: ఎయిమ్స్ డైరెక్టర్ క్లారిటీ
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఎక్కువగా యువతపై ప్రభావం చూపిందని.. థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందని జరుగుతున్న ప్రచారాన్ని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా కొట్టిపారేశారు. థర్డ్ వేవ్లో కరోనా మహమ్మారి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తాను అనుకోవట్లేదన్నారు. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్తో కలిసి ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.
Recommended Video
థర్డ్ వేవ్లో చిన్నారులపై కరోనా ప్రభావం చూపుతుందనడానికి ఎలాంటి నిర్ధిష్టమైన ఆధారాలు లేవని, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదని గులేరియా స్పష్టం చేశారు. దీనిపై ప్రజల్లో ఆందోళన ఉన్నమాట వాస్తవమేనని, అయితే, మరీ అంతగా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

కరోనా మూడో దశ మరింత తీవ్రంగా ఉంటుందని అనుకోవద్దు. కరోనా వివిధ దశల్లో వ్యాపించడానికి కొత్త రకాలు పుట్టుకు వచ్చేందుకు మనుషుల ప్రవర్తనే కారణమని రణదీప్ గులేరియా అన్నారు. రాబోయే దశలను ఆపాలనుకుంటే కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. మూడో దశలో చిన్నారులు తీవ్రంగా ప్రభావితమవుతారనడానికి తగిన ఆధారాలేమీ లేవన్నారు. రెండో దశలోనూ చిన్నారులు కరోనా బారినపడ్డారని తెలిపారు. వారిలో చిన్నపాటి లక్షణాలే కనిపించాయన్నారు. అంతేగాక, భవిష్యత్తులోనూ పెద్దగా ప్రభావం చూపబోదని తేల్చి చెప్పారు.
కరోనాతో ఆస్పత్రుల్లో చేరే 60-70 శాతం మంది పిల్లల్లో కొద్దిపాటి లక్షణాలే ఉన్నాయని తెలిపారు. కరోనా మహమ్మారి శ్వాసకోశాలకు సంబంధించిన వైరస్ కావడంతో దశలవారీగా వ్యాప్తి చెందుతోందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆ తర్వాత ఇది సీజనల్ వ్యాధిగా మారిపోతుందన్నారు. కాగా, దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 13.03 లక్షలకు యాక్టివ్ కేసులు పడిపోయాయి. దేశంలో ఇప్పటి వరకు 24 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.












Click it and Unblock the Notifications