కాబుల్ వాయుమార్గం క్లోజ్: ఎయిరిండియా ఫ్లైట్స్ క్యాన్సిల్: ప్రమాదంలో భారతీయులు
కాబుల్: ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. సుమారు 20 సంవత్సరాలుగా అమెరికా భద్రతా బలగాల రక్షణలో సురక్షితంగా ఉంటూ వచ్చిన ఆ దేశం.. ఇప్పుడు మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. అమెరికా ప్రభుత్వం.. రెండు దశాబ్దాల పాటు ఆప్ఘనిస్తాన్లో మోహరింపజేసిన తన సైన్యాన్ని ఉపసంహరించుకున్న వెంటనే, తాలిబన్లు పేట్రేగిపోయారు. దేశం మొత్తాన్నీ ఆక్రమించుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నద్ధమౌతోన్నారు.
Recommended Video
తాలిబన్లు రాజధాని కాబుల్ను ఆక్రమించుకున్న వెంటనే.. అక్కడి ప్రజలు దేశాన్నే విడిచి పెట్టి వెళ్లడానికి సిద్ధపడ్డారు. గుంపులు గుంపులుగా విమానాశ్రయానికి చేరుకున్నారు. కనిపించిన విమానాన్ని కనిపించినట్టే ఎక్కేయడం మొదలు పెట్టారు. కనీసం టికెట్ కూడా తీసుకున్న దాఖలాలు కనిపించట్లేదు. తాలిబన్ల భయానక పరిపాలనకు భయపడి స్థానికులు దేశం విడిచి పారిపోవడానికీ వెనుకాడట్లేదు. పొరుగు దేశాలైన పాకిస్తాన్, తజకిస్తాన్ సరిహద్దులను మూసివేయడంతో ప్రత్యామ్నాయంగా విమానాలను ఆశ్రయించారు.

కాబుల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏ మాత్రం రక్షణ లేకుండా పోయింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కాబుల్ వాయుమార్గాన్ని మూసివేశారు. ఫలితంగా కాబుల్ విమానాశ్రయం నుంచి ఇక ఏ ఒక్క విమానం కూడా టేకాఫ్ తీసుకోలేదు. ల్యాండ్ కానూ లేదు. కాబుల్ ఎయిర్ స్పేస్లోకి ఏ విమానం కూడా ఇక ప్రవేశించలేదు. సైనిక విమానాలను మాత్రం దీని నుంచి మినహాయించారు. వేర్వేరు దేశాలకు చెందిన సైనిక విమానాలకు మాత్రమే అనుమతి ఉంది.
ఈ మేరకు నోటీస్ టు ఎయిర్మెన్ (నోటం) జారీ అయింది. ఫలితంగా- భారత్ నుంచి కూడా కాబుల్కు వెళ్లదలిచిన ఎయిరిండియా విమానాలు కూడా రద్దయ్యాయి. కాబుల్ ఎయిర్ స్పేస్ను మూసివేయడం వల్ల తాము ఆప్ఘనిస్తాన్కు విమానాలను నడిపించలేమని ఎయిరిండియా అధికారులు స్పష్టం చేశారు. కాబుల్ ఎయిర్ స్పేస్ను మూసివేసిన విషయాన్ని వారు ధృవీకరించారు. తదుపరి ఆదేశాలు అందేంత వరకూ విమానాలను కాబుల్కు నడిపించబోమని తెలిపారు.
అనూహ్యంగా తలెత్తిన ఈ పరిణామంతో కాబుల్లో నివసిస్తోన్న భారతీయుల తరలింపు ప్రమాదంలో పడినట్టే. వారిని తరలించడానికే రెండు ఎయిరిండియా విమానాలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్టాండ్ బైగా ఉంచింది. ఈ రెండూ కూడా ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కాబుల్కు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. ఇక ఈ రెండు ఫ్లైట్ సర్వీసులు కూడా రద్దయినట్టే.
కాగా- కాబుల్ నుంచి బయలుదేరిన తొలి ఎయిరిండియా విమానం ఏఐ 244 డిల్లీకి చేరుకుంది. 129 మంది ప్రయాణికులు సురక్షితంగా భారత్కు చేరుకున్నారు. మరో విడతలో రెండు విమానాలను అక్కడికి పంపించాలని అధికారులు నిర్ణయించినప్పటికీ..అది సాధ్యం కావట్లేదు. కాబుల్ ఎయిర్ స్పేస్ మూసివేయడంతో ఏ దేశానికి చెందిన ఏ విమానం కూడా కాబుల్కు రాకపోకలు సాగించలేదు. ఫలితంగా- అక్కడ ఉన్న భారతీయుల తరలింపు ప్రస్తుతానికి ప్రమాదంలో పడినట్టే కనిపిస్తోంది.
తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు కాబోతోన్న నేపథ్యంలో.. ఆఫ్ఘనిస్తాన ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి. స్వయంగా అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి తజకిస్తాన్కు వెళ్లడం- అక్కడి పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది. మరోసారి తాలిబన్ల ఆటవిక పరిపాలనను భరించాల్సి వస్తుందన్న భయంతో కాబులీవాలాలు దేశం వదిలి వెళ్తోన్నారు. దీనికోసం వేలాదిమంది కాబుల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. రాత్రంతా అక్కడే జాగారం చేశారు. కనిపించిన విమానాన్ని కనిపించినట్టే ఎక్కేశారు.












Click it and Unblock the Notifications