ఆ చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచన కేంద్రానికి లేదు... లోక్సభలో స్పష్టం చేసిన కిషన్ రెడ్డి...
మత మార్పిడులు,మతాంతర వివాహాలకు సంబంధించి మంగళవారం(ఫిబ్రవరి 2) పార్లమెంటులో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆసక్తికర ప్రకటన చేసింది. మతాంతర వివాహాలను అడ్డుకునే మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం లేదని తెలిపింది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్,కర్ణాటకలో యాంటీ లవ్ జిహాదీ చట్టాలను తీసుకొచ్చిన నేపథ్యంలో కేంద్రం కూడా ఆ దిశగా ఏమైనా ఆలోచిస్తోందా అని కేరళకు చెందిన ఐదుగురు ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి బదులిచ్చారు.
'రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం పబ్లిక్ ఆర్డర్,పోలీస్ అనేవి రాష్ట్రాల పరిధిలోని అంశాలు. మత మార్పిడికి సంబంధించిన నేరాలను నివారించడం, గుర్తించడం, నమోదు చేయడం, దర్యాప్తు చేయడం, ప్రాసిక్యూట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయి. ఈ అంశాలకు సంబంధించి ఏవైనా అతిక్రమణలు జరిగినట్లు మా దృష్టికి వస్తే ఇప్పుడున్న చట్టాల ప్రకారం చర్యలు తీసుకోబడుతాయి.' అని కిషన్ రెడ్డి లోక్సభలో స్పష్టం చేశారు.
గతంలోనూ లోక్సభలో లవ్ జిహాదీకి సంబంధించి కేంద్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దేశంలో లవ్ జిహాదీ ఉన్నట్లు ఇప్పటివరకూ ఏ కేంద్ర ఏజెన్సీలు నిర్దారించలేదని పేర్కొంది. అంతేకాదు,ఇప్పుడున్న చట్టాల్లో ఎక్కడా లవ్ జిహాదీ పదమే లేదని చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం... వ్యక్తులు తమకు నచ్చిన మతాన్ని ఆచరించడానికి,అనుసరించడానికి స్వేచ్చ ఉందని స్పష్టం చేసింది.
Recommended Video
కాగా,గతేడాది బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్,కర్ణాటకలో యాంటీ లవ్ జిహాదీ చట్టాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వివాహం కోసం బలవంతపు మత మార్పిడులకు పాల్పడటం లేదా మత మార్పిడి కోసం వేధింపులకు గురిచేయడాన్ని ఈ చట్టాల కింద నేరంగా పరిగణిస్తారు. దోషులుగా తేలినవారికి కఠిన శిక్షలు విధిస్తారు. అయితే ఈ చట్టం తీసుకొచ్చాక ఉత్తరప్రదేశ్లో ఎంతోమంది జంటలు అకారణంగా వేధింపులకు గురవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తిగత మత స్వేచ్చను హరించివేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది.