లాక్ డౌన్ ఎఫెక్ట్.. దేశంలో మరో ఆకలి చావు.. రేషన్ సరుకుల కోసం అధికారుల చుట్టూ తిరిగి..
మన దేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారి సంఖ్య 85శాతానికి పైనే. దేశ జీడీపీలో వీరి కంట్రిబ్యూషన్ 50శాతం పైనే ఉంటుంది. కానీ దేశానికి ఏ ఆపద వచ్చినా మొదట బలయ్యేది వీరే. ప్రస్తుత కరోనా పరిస్థితులను పరిశీలిస్తే.. దేశవ్యాప్తంగా అసంఘటిత రంగం కుదేలైంది. ఉద్యోగాలు,ఉపాధి కోల్పోయి కార్మికులు,కూలీలు చెల్లాచెదురయ్యారు. తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో కేవలం ప్రభుత్వాల పైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వాలు,అధికారులు కూడా పట్టించుకోని చోట కొన్ని ఆకలి చావులు కూడా నమోదవుతున్నాయి. తాజాగా పంజాబ్లోని లూథియానాలో ఓ యువకుడు(37) ఆకలి కారణంగా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
లాక్ డౌన్-సడలింపులు-లాక్ డౌన్- కేంద్రానికి ఈ దోబూచులాట తప్పదా ?
మృతుడి భార్య ఏమంటోంది..
మృతుడి భార్య సవిత వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమె భర్త అజిత్ కుమార్ ఓ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. లాక్ డౌన్ తర్వాత అజిత్ ఉపాధి కోల్పోయాడు. ఇంట్లో సరుకులు కూడా లేకపోవడంతో ఆ కుటుంబం ఆకలికి అల్లాడుతోంది. స్థానిక అధికారులను సంప్రదించి రేషన్ సరుకులు తీసుకొచ్చేందుకు కొద్దిరోజులుగా అజిత్ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఏ ఒక్కరి నుంచి సానుకూల స్పందన రాలేదు. కుటుంబానికి తిండి పెట్టలేకపోతున్నానని తీవ్ర మనస్తాపం చెంది చివరకు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అవమానించిన పోలీసులు..
తన భర్త చావుకు అధికారుల వైఫల్యమే కారణమని అజిత్ భార్య సవిత ఆరోపించింది. అయితే పోలీసులు మాత్రం పని లేకపోవడం వల్లే అజిత్ ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. మానవ్ సమాజ్ సంఘటన్ అనే ఎన్జీవో ప్రతినిధి ఆర్కే యాదవ్ మాట్లాడుతూ... గత రెండు వారాలుగా అజిత్ రేషన్ సరుకుల కోసం ప్రయత్నించి మనస్తాపానికి గురయ్యాడన్నారు. ఆఖరికి పోలీస్ స్టేషన్కు కూడా వెళ్లి తన పరిస్థితిని వివరించాడని... కానీ అక్కడి పోలీస్ అధికారులు అతన్ని అవమానించి పంపిచారని చెప్పారు.
Recommended Video
ఆరోపణలను ఖండించిన పోలీసులు
పోలీస్ స్టేషన్ నుంచి రాత్రి 9గంటల సమయంలో ఇంటికొచ్చిన అజిత్.. వచ్చీ రాగానే తన గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకున్నట్టు చెప్పారు. కొద్దిసేపటికి అజిత్ భార్య వెళ్లి చూసేసరికి.. అతను ఉరివేసుకుని కనిపంచాడన్నారు. అతని వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదన్నారు. అజిత్ మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ అతని భార్య బోరున విలపించింది. మరోవైపు పోలీసులు మాత్రం ఆమె ఆరోపణలు నిరాధారం అని ఖండించారు. రేషన్ సరుకులు లేకపోవడం వల్ల అతను చనిపోలేదని,ఉద్యోగం పోయిందన్న బాధలో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు.