టీపై రెండో ఆలోచన లేదు, నోట్ రెడీ: మనీష్ తివారీ
న్యూఢిల్లీ: తెలంగాణపై రెండో ఆలోచన లేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర మంత్రి మనీష్ తివారీ అన్నారు. ఎఐసిసి అధికార ప్రతినిధి పిసి చాకో కూడా విడిగా అదే మాట అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నోట్ తయారైందని, హోంశాఖ ఆ నోట్ను సిద్ధం చేసిందని, త్వరలో అది కేంద్ర మంత్రివర్గం ముందుకు వస్తుందని మనీష్ తివారీ శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజకీయ ఆమోదం లభించిన తర్వాత నోట్ మంత్రివర్గం ముందుకు త్వరలోనే వస్తుందని ఆయన చెప్పారు.
ఐదు రాష్ట్రాలకు జరిగే ఎన్నికలు తెలంగాణ అంశంపై ప్రభావం చూపబోవని, ఆ ఎన్నికలు తెలంగాణ ప్రక్రియకు అడ్డంకి కాబోవని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. హైదరాబాద్పై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
తెలంగాణ ప్రక్రియ ముందుకు సాగుతోందని ఎఐసిసి అధికార ప్రతినిధి పిసి చాకో అన్నారు. తెలంగాణపై వెనకడుగు వేసే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. యాభై ఏళ్లుగా తెలంగాణ సమస్యను పరిష్కరలేదంటే అది ఎంత జఠిలమైందో ఆర్థం చేసుకోవచ్చునని, దానిపై కాంగ్రెసు నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని, యుపిఎ కూడా దాన్ని ఆమోదించిందని ఆయన చెప్పారు.
తెలంగాణపై సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయంపై వెనక్కి వెళ్లేది లేదని ఆయన చెప్పారు. తెలంగాణపై ముందుకు వెళ్లడంలో సమస్యలున్నాయని, ఆ సమస్యలకు పరిష్కార విధానాలు కూడా తమ వద్ద ఉన్నాయని ఆయన అన్నారు. ఇరు ప్రాంతాల్లో పరిస్థితిని తాము చక్కదిద్దుతామని చాకో చెప్పారు. ఉద్యమాల ఒత్తిడితో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు రాజీనామాలకు సిద్ధపడి ఉండవచ్చునని ఆయన అన్నారు.