ఒక్క కోవిడ్ కేసు కూడా లేని గ్రామం... ఏడాది కాలంగా ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదవలేదు...
కరోనా సెకండ్ వేవ్లో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా ప్రభావం పడింది. కరోనా మొదటి వేవ్లో గ్రామాలపై అంతగా ప్రభావం కనిపించనప్పటికీ సెకండ్ వేవ్లో గ్రామాల్లోనూ మరణాలు చోటు చేసుకున్నాయి. ఇటీవలి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అధ్యయనం ప్రకారం మే నెలలో దేశవ్యాప్తంగా నమోదైన కొత్త కేసుల్లో 48.5శాతం గ్రామాల్లో నమోదైనవే.
గత మార్చిలో ఇది 36.8 శాతం ఉండగా ఈ ఒక్క నెలలోనే 11శాతం మేర పెరిగింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం గ్రామాలపై ఎంతలా ఉందో ఈ లెక్కలు చెబుతున్నాయి. అయితే మొదటి వేవ్ నుంచి రెండో వేవ్ వరకూ ఒక్క కేసు కూడా నమోదవని గ్రామాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు.
ఆ గ్రామంలో ఒక్క కేసు కూడా లేదు...
ఒడిశాలోని గంజాం జిల్లా దానాపూర్ పంచాయతీ పరిధిలో ఉన్న కరంజర గ్రామంలో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదవలేదు. గ్రామంలో 261 కుటుంబాలు 1234 మంది ప్రజలు నివసిస్తున్నారు. కనీసం కరోనా లక్షణాలు ఉన్నట్లు కూడా ఇంతవరకూ ఎవరి నుంచి ఫిర్యాదు రాలేదు.కరోనా కేసులేవీ లేనప్పటికీ స్థానిక ఆశా,అంగన్వాడీ హెల్త్ కేర్ వర్కర్లు రెగ్యులర్గా ఆ గ్రామానికి వెళ్లి డోర్ టు డోర్ సర్వే చేస్తున్నారు.
ముఖ్యంగా వృద్దుల ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గ్రామంలో ఒక్క కోవిడ్ కేసు కూడా లేకపోవడంలో ఈ హెల్త్ కేర్ వర్కర్లు పోషించిన పాత్ర కీలకమని అధికారులు చెబుతున్నారు.
కలెక్టర్ ఏం చెబుతున్నారు...
గంజాం కలెక్టర్ విజయ్ కులంగే ఇటీవలే కరంజర గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. కోవిడ్ 19 సేఫ్టీ ప్రోటోకాల్స్ పట్ల అక్కడి ప్రజలు పూర్తి అవగాహనతో ఉన్నట్లు చెప్పారు. చిన్నారులు సహా ప్రతీ గ్రామస్తుడు తప్పనిసరిగా మాస్కు ధరిస్తున్నారని,భౌతిక దూరం పాటిస్తున్నారని చెప్పారు.
అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇంటి నుంచి బయటకు వెళ్లడం లేదన్నారు. కరోనా మొదలైన నాటి నుంచి ఈ నిబంధనలు పాటించాలని తాము గ్రామస్తుల్లో అవగాహన కల్పించామని గ్రామ సర్పంచ్ త్రినాథ్ బెహారా తెలిపారు.
పండుగలకు దూరంగా...
కరంజర గ్రామానికి చెందిన కొంతమంది యువత ముంబైలో పనిచేస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత వీరిలో కొంతమంది స్వగ్రామానికి రాగా.. మరికొందరు అక్కడే ఉండిపోయారు. గ్రామానికి వచ్చినవారు.. మొదట ప్రభుత్వ హెల్త్ కేర్ సెంటర్లలో 14 రోజుల పాటు క్వారెంటైన్లో ఉన్నారు.
ఆ తర్వాతే గ్రామంలోకి వారిని అనుమతించారు. గతేడాది కరోనా మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ గ్రామంలో ఎటువంటి పండుగలు,వేడుకలు నిర్వహించలేదు. అలాగే గ్రామాన్ని ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తున్నారు. గ్రామంలో ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించడం వల్లే ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదవలేదని గ్రామస్తులు చెబుతున్నారు.