సోనియా కొత్త వ్యూహం.. బీజేపీకి చెక్ పెట్టేనా.. కలిసొచ్చేదెవరు..?
ప్రతీ కార్యం వెనక పరమార్థం ఉంటుంది. అసలు కార్యం ఒకటైతే దాని వెనక అర్థం మరొకటి ఉంటుంది. ఇది రాజకీయాల్లో కామన్. అవసరమనుకుంటే చిరకాల శతృవుతో నైనా స్నేహం చేయగలరు రాజకీయ నాయకులు. ఇక దేశ రాజకీయాల్లో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశాం. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశం వెనక పరమార్థం మరొకటి ఉందని స్పష్టమవుతోంది. పేరుకు నీట్, జీఎస్టీలపై చర్చిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చినా దీని వెనక నిగూఢమైన రాజకీయ చాణక్యం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సమావేశం అసలు అజెండా ఏంటి..?
బుధవారం రోజున సోనియాగాంధీ మరియు మమతా బెనర్జీలు కలిసి బీజేపీయేతర ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ముఖ్యమంత్రులు నిప్పులు చెరిగారు. నీట్ ఎగ్జామ్ నిర్వహణపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించగా జీఎస్టీపై కూడా ఇదే సమావేశంలో చర్చించారు. ఇక రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన వాటాపై పోరాటం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ సమావేశాన్ని మరో కోణంలో చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ సమావేశం వెనక పరమార్థం మరొకటి ఉందని చెబుతున్నారు.
దీదీకి కాంగ్రెస్ అవసరం ఉందా..?
త్వరలోనే బెంగాల్తో సహా బీహార్, తమిళనాడుల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే మమతా ఈ సమావేశం నిర్వహించడం వెనక కాంగ్రెస్ను మచ్చిక చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. రానున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి విజయం సాధించి మూడోసారి పీటాన్ని దక్కించుకోవాలని దీదీ భావిస్తోంది. అయితే బెంగాల్లో కూడా క్రమంగా బీజేపీ పార్టీ బలపడుతోంది. ఇక గత పదేళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్పై ప్రజావ్యతిరేకత కనిపిస్తోంది. ఈ క్రమంలో ఓట్లు చీలకుండా ఉండేందుకు కాంగ్రెస్తో కలిసి బెంగాల్లో మమతా పోటీ చేసే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ సాధించిన సీట్లను చూస్తే అక్కడ కాషాయం పార్టీ పుంజుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక బెంగాల్లో మోడీ - షా ద్వయం అడుగుపెడితే దీదీకి కాస్త కష్టంగానే మారొచ్చనే మాటలు వినిపిస్తున్నాయి.
విశ్లేషకులు ఏం చెబుతున్నారు..?
ఇక కాంగ్రెస్ కూడా బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలతో జతకట్టాలని భావిస్తోంది. అందులో భాగంగా పడిన మొదటి అడుగే ఈ రోజు సమావేశంగా మరికొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు నీట్, లేదా జీఎస్టీ అనే అంశాలు ఆయా ముఖ్యమంత్రులు కలిసి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటే సరిపోతుంది. లేదా కోర్టుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. దీనికోసం సమావేశాలు పెట్టాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నితీష్ కుమార్ కాంగ్రెస్తో జతకట్టారు. ఆ తర్వాత పరిణామాలతో ఆయన బీజేపీకి షేక్హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు నితీష్ కుమార్ స్థానాన్ని దీదీ రీప్లేస్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
Recommended Video
రాష్ట్రాల్లో ఎన్నికలకు ఇప్పటి నుంచే...
ఈ రోజు కేవలం బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశమే జరిగింది కానీ రానున్న రోజుల్లో బీజేపీయేతర పార్టీలన్నీ ఒకే వేదికపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2018లో చివరిలో బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమయ్యాయి. అయితే అది ఎన్నికలకు ముందు జరగడంతో పెద్దగా ఫలించలేదు. కానీ త్వరలో జరగబోయే బెంగాల్, బీహార్, తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించి బలంగా మారాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా చాలా నష్టపోయి ప్రజలు ప్రస్తుత ప్రభుత్వాలపై వ్యతిరేకతతో ఉన్నారు. అదే సమయంలో మారిటోరియం పేరుతో బ్యాంకులు భారీగా ఛార్జీలు బాదాయి. దీనిపై కూడా ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. వీటన్నిటినీ ఆయుధాలుగా మలుచుకుని ఎన్నికలకు సన్నద్ధం కావాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ఇక బుధవారం జరిగిన సమావేశానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఆహ్వానం ఉన్నప్పటికీ ఆయన హాజరుకాలేదు. అదే సమయంలో కేరళ సీఎం పినరాయి విజయన్కు ఆహ్వానం ఉన్నప్పటికీ కాంగ్రెస్ నుంచే వ్యతిరేకత వ్యక్తం అవడంతో ఆయన హాజరుకాలేదు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్కు ఏపీ సీఎం జగన్కు ఆహ్వానం పంపినట్లు సమాచారం కానీ వీరు హాజరు కాలేదు. ఇప్పుడు నీట్పై సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావించిన నేపథ్యంలో ఆ తర్వాత జరిగే పరిణామాల పై కాంగ్రెస్ తదుపరి అడుగులు వేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.