నానమ్మ హంతకులు నాతో ఆడారు: రాహుల్ గాంధీ
చురు (రాజస్థాన్): తాను విభజన రాజకీయాలు చేస్తున్నట్లు బిజెపి చేస్తున్న విమర్శలను ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తిప్పికొట్టారు. తన నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ హత్యోదంతాలను గుర్తు చేసుకుంటూ ఆయన మాట్లాడారు. రాజస్థాన్లోని చురు ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు.
ద్వేషం తమ నానమ్మను చంపిందని, తన తండ్రి విషయంలోనూ అదే జరిగిందని, తన విషయంలోనూ అది జరగవచ్చునని, దానికి తాను భయపడడం లేదని ఆయన అననారు. బిజెపి మతతత్వ పార్టీ అని ఆయన నిందించారు. తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బిజెపి విద్వేషాన్ని పెంచి పోషిస్తోందని దూషించారు.
వాళ్లు ముజఫర్నగర్, గుజరాత్, కాశ్మీర్ వెళ్లి ద్వేషాన్ని రగిలిస్తారని, తాము చల్లార్చడానికి వెళ్తామని ఆయన అన్నారు. సిక్కు బాడీ గార్డులు 1984లో తమ నానమ్మ ఇందిరా గాంధీని చంపిన ఉదంతాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తమ నానమ్మను చంపేశారని తన సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పాడని, తన కాళ్లు వణికాయని, ప్రియాంకనూ తననూ ఇంటికి తీసుకుని వెళ్లారని, రోడ్డుపై రక్తం పారుతోదని, గదిలో తమ మిత్రులపై రక్తం ఉందని ఆయన చెప్పారు.
పద్నాలుగేళ్ల వయస్సులో ఉన్న తనను సమాచారం తెలిసిన వెంటనే తనను బడి నుంచి ఇంటికి పంపారని ఆయన చెప్పారు. తమ నానమ్మను చంపిన బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్ తనతో బ్యాడ్మింటన్ ఆడారని ఆయన గుర్తు చేసుకున్నాడు.
బియాంత్, సత్వంత్ సింగ్లు తన మిత్రులని, బ్యాడ్మింటన్ ఎలా ఆడాలో తనకు నేర్పారని ఆయన చెప్పారు. 1984లో తోటలో తాను బియాంత్ సింగ్ను కలిశానని, మీ నానమ్మ ఎక్కడ పడుకుంటారని అడిగాడని, భద్రత సరిపోతుందా అని ప్రశ్నించాడని, గ్రెనేడ్ విసిరితే ఎలా కింద పడుకోవాలో చూపించాడని, అప్పుడు అతను ఎందుకు అలా చెపుతున్నాడో అర్థం కాలేదని, దీపావళి సందర్భంగా వారిద్దరు నానమ్మపైకి గ్రెనేడ్ విసరాలని అనుకున్నారని తర్వాత తెలిసిందని ఆయన వివరించారు.